Afghanistan: వారెవ్వా ఆఫ్ఘనిస్థాన్... ఈసారి శ్రీలంక బలైంది!

  • వరల్డ్ కప్ లో నేడు శ్రీలంక × ఆఫ్ఘనిస్థాన్
  • 7 వికెట్ల తేడాతో గెలిచిన ఆఫ్ఘన్ జట్టు
  • 242 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లకు కొట్టేసిన ఆఫ్ఘన్లు
  • పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకున్న వైనం
Afghanistan beats Sri Lanka by 7 wickets

వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ జోరు కొనసాగుతోంది. తనకంటే మెరుగైన ర్యాంకింగ్ ఉన్న జట్లకు ఆఫ్ఘనిస్థాన్ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లకు తన తడాఖా రుచిచూపిన ఆఫ్ఘన్ జట్టు ఇవాళ శ్రీలంకను కూడా చిత్తు చేసింది. 

పూణేలో శ్రీలంకతో జరిగిన పోరులో ఆఫ్ఘనిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. 242 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. 45.2 ఓవర్లలోనే గెలుపు తీరాలకు చేరింది. 

అజ్మతుల్లా ఒమర్ జాయ్ (73 నాటౌట్), రహ్మత్ షా (62), కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58 నాటౌట్) అర్ధసెంచరీలతో ఆఫ్ఘన్ ఇన్నింగ్స్ ను నడిపించారు. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 39 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ అయినప్పటికీ, ఆ ప్రభావమే లేకుండా ఆఫ్ఘన్ టాపార్డర్ బ్యాటర్లు ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లడం విశేషం. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2, కసున్ రజిత 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకడం విశేషం. టోర్నీలో ఇప్పటిదాకా 6 మ్యాచ్ లు ఆడిన ఆఫ్ఘన్ జట్టు 3 విజయాలు సాధించింది. టోర్నీలో ఆఫ్ఘన్ ఇంకా నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

More Telugu News