Revanth Reddy: ఎంపీపై దాడితో చిల్లర రాజకీయమా?: కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్

  • కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని కాంగ్రెస్‌‌కు అంటగట్టే ప్రయత్నమన్న రేవంత్ రెడ్డి
  • కేసీఆర్ డ్రామాలు తెలంగాణ సమాజానికి అర్థమైందన్న టీపీసీసీ చీఫ్
  • కాంగ్రెస్ పార్టీ అహింసనే ఆయుధంగా చేసుకుందన్న రేవంత్ రెడ్డి
Revanth Reddy counter to Minister KTR

మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ మీద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని కాంగ్రెస్‌కు అంటగట్టాలని, తద్వారా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నారని కేటీఆర్‌పై మండిపడ్డారు. మీతండ్రి కేసీఆర్ డ్రామాలు తెలంగాణ సమాజానికి అర్థమైందని రేవంత్ పేర్కొన్నారు.

'డ్రామారావూ… కేసీఆర్ అంటేనే గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార విద్యలకు మారుపేరని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టే' నని పేర్కొన్నారు. ఈ సరికొత్త మొండి కత్తి డ్రామాను మీరు, మీ తండ్రి కలిసి రక్తి కట్టిస్తున్న వైనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని, జరిగిన దుర్ఘటనను కాంగ్రెస్‌కు అంటగట్టే మీ కుటిల నీతి ప్రజలకు అర్థమైందన్నారు. ఏది ఏమైనా దాడిని మాత్రం ఖండిస్తున్నామని, అహింసనే ఆయుధంగా చేసుకుని దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించిన కాంగ్రెస్‌కు మీ తండ్రిలాంటి మరుగుజ్జును ఓడించడం పెద్ద లెక్క కాదన్నారు.

అంబర్‌పేట ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం అంబర్ పేట ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి ఘటనపై స్పందించారు. కాంగ్రెస్ కార్యకర్త ఈ దాడి చేశారంటూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఎన్నికల్లో సానుభూతి కోసం మొండి కత్తితో దాడి చేయించి కాంగ్రెస్ ఖాతాలో వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు దాడి ఎందుకు జరిగిందో చెప్పకుండా దాడిని కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారన్నారు. అబద్ధాలు చెప్పినందుకు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎప్పుడూ హింసను ప్రోత్సహించదన్నారు. తమ పార్టీ కార్యకర్త దాడి చేసినట్లు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. 

More Telugu News