UP Police: యూపీలో ఎన్ కౌంటర్ లో మొబైల్ స్నాచర్ హతం

  • ఆటోలో వెళుతున్న యువతి చేతిలో నుంచి మొబైల్ లాక్కున్న జితూ
  • ఈ ఘటనలో రన్నింగ్ ఆటో నుంచి కిందపడ్డ బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Mobile Snacher Killed in UP Police Encounter

మొబైల్ దొంగతనం చేసే క్రమంలో బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్ మరణానికి కారణమైన రెండో నిందితుడు తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. ఉత్తరప్రదేశ్ లోని ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ లో ఈ నెల 27న ఇద్దరు మొబైల్ స్నాచర్లు దారుణానికి పాల్పడ్డారు. ఆటోలో వెళుతున్న బీటెక్ స్టూడెంట్ కీర్తి సింగ్ ను బైక్ పై వెంబడించి మొబైల్ ను లాక్కున్నారు. కీర్తి ప్రతిఘటించడంతో ఆమె చేయి పట్టుకుని కిందకి లాగారు, ఆపై కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. తర్వాత ఆమె మొబైల్ లాక్కుని పారిపోయారు. రన్నింగ్ ఆటో నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలపాలైన కీర్తిని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ చనిపోయింది.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొబైల్ స్నాచింగ్ కు పాల్పడిన దొంగలను గుర్తించిన పోలీసులు.. వారికోసం వేట ప్రారంభించారు. ఒక నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించిన పోలీసులు.. రెండో నిందితుడు జితూ కోసం రాష్ట్రవ్యాప్తంగా గాలించారు. ఈ క్రమంలో ముస్సోరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జితూ ఉన్నాడనే సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నంలో జితూ గంగానాహర్ ట్రాక్ పై పరుగులు పెట్టాడు. పోలీసుల పై దాడికి ప్రయత్నించగా.. పోలీసులు కాల్పులు జరపడంతో జితూ గాయపడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను చనిపోయాడని పోలీసులు తెలిపారు.

More Telugu News