Punjab: అందరూ చూస్తుండగానే దుకాణ యజమానిపై కాల్పులు.. వీడియో ఇదిగో!

  • పంజాబ్‌లోని భటిండాలో ఘటన
  • బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయిన దుండగులు
  • చికిత్స పొందుతూ షాపు యజమాని మృతి
 Punjab Shopkeeper Shot Dead Outside His Shop In Bhatinda

పంజాబ్‌లోని భటిండాలో అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. దుకాణం బయట కూర్చుని ఫోన్ చూస్తున్న యజమానిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అక్కడి సీసీటీవీ కెమెరాలో ఈ ఘటన రికార్డయింది. బాధితుడు హర్జిందర్ సింగ్ జోహాల్ తన ‘అమృత్‌సరి కుల్చా’ షాపు బయట కూర్చుని ఉండగా బైక్‌పై వచ్చిన దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు.  

తీవ్రంగా గాయపడిన జోహాల్‌ను బటిండా ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మ్యాక్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ మరణించాడు. ఈ ఘటనపై జోహాల్ షాపులో పనిచేసే వర్కర్ మాట్లాడుతూ.. కాల్పుల శబ్దం విని తొలుత టపాసులు అనుకున్నానని పేర్కొన్నాడు. ఆ వెంటనే జోహాల్ గట్టిగా అరుస్తూ తనపై కాల్పులు జరుపుతున్నారని, వారిని పట్టుకోవాలని కేకలు వేశారని చెప్పాడు. తాను వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పారిపోయారని తెలిపాడు. 

నిందితులను గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పుల వెనకున్న కారణం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై తర్వాత విపక్ష పార్టీ నేతలు భగవంత్‌మాన్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా మారిపోయాయని శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుక్వీర్ సింగ్ బాదల్ ఆరోపించారు.

More Telugu News