Andhra Pradesh: ఏపీ, తెలంగాణ.. రెండు చోట్లా ఓటేసుకోవచ్చా?.. ఏపీ ఎన్నికల అధికారి చెప్పింది ఇదే!

  • రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ తమ వద్ద లేదన్న ముకేశ్‌కుమార్
  • మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్
  • 18 ఏళ్లు నిండినవారు డిసెంబరు 9లోగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే వీలు
  • వచ్చే ఏడాది అక్టోబరునాటికి 18 ఏళ్లు నిండితే కూడా ముందస్తుగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
  • రాష్ట్రంలో 10 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు
AP Election notification on next March

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు హక్కు వినియోగించుకున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై తాజాగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా స్పందించారు.  ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు పార్టీలు తమ దృష్టికి తెచ్చాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ తమ వద్ద లేదని తెలిపారు. ఆయన వ్యాఖ్యలను బట్టి రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్న వారిని ఓటు వేయకుండా అడ్డుకోలేమన్న విషయం స్పష్టమవుతోంది.  

మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉందని ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు. నిన్న ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తొలి జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. జనవరి 1 నాటికి పూర్తి జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటి వరకు ఆ పనిచేయని వారు డిసెంబరు 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, వచ్చే ఏడాది ఏప్రిల్ 1 లేదంటే జులై 1 లేదా, అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండితే కనుక అలాంటి వారు కూడా ముందస్తుగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. అలాగే, 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్టు వెల్లడించారు.

More Telugu News