Yanamala: జైల్లో చంద్రబాబు పరిస్థితిని న్యాయమూర్తి వెంటనే పరిశీలించాలి: యనమల

  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు
  • తనకు ప్రాణహాని ఉందంటూ ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ
  • పాలకుల తీరు చూస్తే ప్రాణహాని ఉందన్న విషయం అర్థమవుతోందన్న యనమల
Yanamala responds on Chandrababu letter

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు... జైల్లో తనకు ప్రాణహాని ఉందంటూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. 

జైల్లో తన ప్రాణాలకు హాని ఉందని, జైల్లో తగిన భద్రత లేదని చంద్రబాబే స్వయంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చెప్పారని, ఆయనకు ప్రభుత్వం సరైన భద్రత కల్పించిందా లేదా అని న్యాయమూర్తి వెంటనే పరిశీలించాలని యనమల విజ్ఞప్తి చేశారు. 

జైలుపై గతంలో డ్రోన్ తిరిగిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి విచారణ చేపట్టలేదని ఆరోపించారు. చంద్రబాబు జైల్లో ఉన్నారనే కంటే ప్రభుత్వ కస్టడీలో ఉన్నారని చెప్పడమే కరెక్ట్ అని స్పష్టం చేశారు. 

టీడీపీ అధినేత జైలుకు వెళ్లినప్పటినుంచీ ఆయన విషయాలన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జలే పర్యవేక్షిస్తున్నాడని విమర్శించారు. జైలు అధికారులు, వైద్యులు, ఇతరులు ఏం చేయాలో... ఏం మాట్లాడాలో అంతా సజ్జలే నిర్ణయిస్తున్నాడని యనమల ఆరోపించారు. 

వైద్యులు ప్రతిరోజు చంద్రబాబుని పరీక్షించాక ఆయన ఆరోగ్య సమాచారం ఎందుకు బహిర్గతం చేయడంలేదు? అంటూ యనమల నిలదీశారు. డాక్టర్లు ఇచ్చిన ఒరిజినల్ రిపోర్టుని కాదని జైలర్ ధ్రువీకరించిన రిపోర్టుని ఎందుకు మీడియాకు చూపిస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసే పెద్ద బోగస్  కేసు... రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపారని ప్రజలు గ్రహించారని యనమల వ్యాఖ్యానించారు.

More Telugu News