MS Dhoni: ధోనీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్!.. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆడేదీ లేనిదీ హింట్!

  • మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నట్టు వెల్లడి
  • రోజువారీ పనుల్లో ఎలాంటి సమస్య లేదని వివరణ
  • సంపూర్ణంగా కోలుకుంటే ఐపీఎల్2024లో ఆడే అవకాశం
MS Dhoni hints about playing in IPL with CSK

వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‌లో ‘ఝార్ఖండ్ డైనమైట్’ మహేంద్ర సింగ్ ధోని ఆడతాడా? లేదా? మరోసారి మైదానంలో అతడి ఆటను ఆస్వాదించగలమా? లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి చిన్నపాటి గుడ్‌న్యూస్. వచ్చే సీజన్‌లో ఆడే విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కీలక అప్‌డేట్ ఇచ్చాడు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్యలూ లేవని ధోని వెల్లడించాడు. సంపూర్ణంగా కోలుకునే దిశగా పురోగమిస్తున్నట్లు ప్రకటించాడు. అక్టోబర్ 26న బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ విషయాలను పంచుకున్నాడు.

శస్త్రచికిత్సను తన మోకాలు తట్టుకోగలిగిందని, నవంబర్ నాటికల్లా కోలుకుంటానని వైద్యుడు తనతో చెప్పారని ధోని అన్నాడు. ప్రస్తుతం రోజువారీ దినచర్యలో ఎలాంటి సమస్య లేదని వివరించాడు. కాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో ధోనీ పలు అంశాలపై మాట్లాడుతూ.. నిష్ణాతుడైన క్రికెటర్‌గా ప్రత్యేకంగా గుర్తింపు పొందడం తన లక్ష్యం కాదని పేర్కొన్నాడు. జనాలు తనను మంచి క్రికెటర్‌గా గుర్తుంచుకోవాలని తాను కోరుకోలేదని, మంచి మనిషిగా గుర్తుంచుకుంటే చాలని అభిలషించాడు.

కాగా ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ను టైటిల్ విజేతగా ఎంఎస్ నిలబెట్టాడు. అయితే మోకాలి సమస్య కారణంగా జట్టుకు బ్యాటింగ్‌లో పెద్దగా సహకారాన్ని అందించలేకపోయిన విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ తర్వాత ధోనీ భవిష్యత్తుపై చాలా ఊహాగానాలు వచ్చాయి. ఇక ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే.

More Telugu News