Michael Vaughan: ఇక భారత్ చేతిలో ఓడిపోవడమే తరువాయి... శ్రీలంక చేతిలో ఇంగ్లండ్ ఓటమిపై మైఖేల్ వాన్ స్పందన

  • వరల్డ్ కప్ లో దారుణంగా ఆడుతున్న ఇంగ్లండ్
  • ఇవాళ శ్రీలంక చేతిలో 8 వికెట్ల తేడాతో పరాజయం
  • ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలో ఇంత ఘోరంగా ఏ వరల్డ్ కప్ లోనూ ఆడలేదన్న వాన్
  • ఎక్కడో ఏదో తేడా కొడుతోందని వెల్లడి
Michael Vaughan opines on England lose to Sri Lanka

గత వరల్డ్ కప్ ను నెగ్గి దూకుడైన ఆటతో క్రికెట్లో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పిన ఇంగ్లండ్ జట్టు ప్రస్తుత వరల్డ్ కప్ లో ఆడుతున్న తీరు విమర్శకులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. పసికూన ఆఫ్ఘనిస్థాన్ చేతిలో పరాజయం పాలైన ఇంగ్లండ్, ఇవాళ శ్రీలంక చేతిలో దారుణంగా ఓడిపోయింది. 

ఇప్పటివరకు టోర్నీలో 5 మ్యాచ్ లు ఆడిన ఇంగ్లండ్ 4 మ్యాచ్ ల్లో ఓడిపోయి సెమీస్ అవకాశాలను అత్యంత సంక్లిష్టం చేసుకుంది. దీనిపై ఇంగ్లండ్ మాజీ సారథి మైఖేల్ వాన్ స్పందించాడు. 

ఇంగ్లండ్ క్రికెట్ చరిత్రలోనే ఇంత ఘోరంగా ఏ వరల్డ్ కప్ లో ఆడలేదని, పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ ఘోర పరాజయాలకు పలు కారణాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఎక్కడో ఏదో తేడా కొడుతోందని తెలిపాడు. 

టోర్నీలో అన్ని జట్లు ఇంగ్లండ్ ను ఓడిస్తున్నాయని, ఇక భారత్ చేతిలో ఓడిపోవడమే తరువాయి అని మైఖేల్ వాన్ తమ జట్టు పరిస్థితి పట్ల విచారం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ లో టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఈ నెల 29న లక్నోలో తలపడనున్నాయి.

More Telugu News