Nara Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేసిన నారా భువనేశ్వరి

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చంద్రబాబు అరెస్ట్ అనంతరం మృతి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు
  • నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర
  • తిరుపతిలో మహిళలతో ముఖాముఖి
Nara Bhuvaneswari satires on AP Govt

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి నిజం గెలవాలి బస్సు యాత్రలో భాగంగా తిరుపతి విచ్చేశారు. మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరెస్టులు, కేసులతో వేధించడమే ఏపీ ప్రభుత్వ గొప్పదనం అని అన్నారు. ఏపీ నెంబర్ వన్ గా ఉంది ఇందులోనే అని ఎద్దేవా చేశారు. నాడు మహాత్మాగాంధీ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడితే, నేడు వైసీపీ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సి వస్తోందని తెలిపారు. 

ఆఖరికి చంద్రబాబు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాస్తే, పనీపాటా లేనట్టు ఆ లేఖపైనా విచారణ జరుపుతున్నారని భువనేశ్వరి విమర్శించారు. లేఖపై విచారణ కోసం వినియోగించే సమయాన్ని రాష్ట్రాభివృద్ధి కోసం వినియోగిస్తే బాగుంటుందని హితవు పలికారు. 

టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని, ఇలాంటి వాటికి భయపడకుండా ఐక్యంగా పోరాడుదాం అని పార్టీ శ్రేణులుకు భువనేశ్వరి పిలుపునిచ్చారు. మనం ఇప్పుడు చేసే పోరాటం భవిష్యత్తు కోసమేనని ఉద్ఘాటించారు.

More Telugu News