Karnataka: కర్ణాటకలో ప్రమాదం.. 12 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల మృతి

  • ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన కారు
  • చిక్కబళ్లాపుర సమీపంలో హైవేపై ఘోర ప్రమాదం
  • దట్టమైన పొగమంచు వల్ల దారి కనిపించకపోవడమే కారణం
Twelve from Andhra Pradesh killed in road accident in Karnataka

కర్ణాటకలోని చిక్కబళ్లాపుర సమీపంలో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఓ కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 12 మంది చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేనని కర్ణాటక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఏడుగురు కన్నుమూశారని వివరించారు. ప్రమాద తీవ్రతకు కారు మొత్తం నుజ్జునుజ్జుగా మారిందని, డోర్లు పూర్తిగా జామ్ కావడంతో వాటిని కట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపైన చిక్కబళ్లాపుర శివార్లలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉందని వివరించారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించామని, వారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఈ ఘోర ప్రమాదానికి కారణం దట్టంగా కురిసిన పొగమంచేనని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులలో ఒకరిది గోరంట్ల అని, బెంగళూరులో ఉంటున్నారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

More Telugu News