Cricket: న్యూజిలాండ్‌పై గెలుపు తర్వాత ఒకే కారులో విరాట్, రోహిత్ ప్రయాణం.. వీడియో ఇదిగో

  • కివీస్‌పై గెలుపును ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్న స్టార్ క్రికెటర్లు
  • మ్యాచ్ తర్వాత ఇద్దరూ ఎక్కడికో వెళ్లారంటూ వీడియో వైరల్
  • ఆటగాళ్ల మధ్య సానుకూల వాతావరణం మంచిదేనంటున్న ఫ్యాన్స్
Virat Kohli Rohit Sharma Bromance Takes Spotlight

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌ 2023లో భారత్ చెలరేగిపోతోంది. వరుస విజయాలతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ గెలిచి, టేబుల్ టాపర్‌గా నిలిచి శెభాష్ అనిపించుకుంటోంది. ముఖ్యంగా గత ఆదివారం చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై తొలి విజయాన్ని టీమిండియా అందుకుంది. ఎప్పటినుంచో వెంటాడుతున్న ఈ చెత్త రికార్డును తుడిచివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. న్యూజిలాండ్‌పై విజయాన్ని అభిమానులే కాదు.. క్రికెటర్లు సైతం తెగ ఆస్వాదిస్తున్నారు. 

కివీస్‌పై గెలుపులో ముఖ్యపాత్ర పోషించిన కింగ్ విరాట్ కోహ్లీతోపాటు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విజయాన్ని మరింత ఎంజాయ్ చేస్తున్నారు. మ్యాచ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ‌ని హిట్‌మ్యాన్ ఆప్యాయంగా హత్తుకున్నాడు. శెభాష్ అంటూ మెచ్చుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతర దృశ్యాలు వీరిద్దరి మధ్య సుహృద్భావం, సోదరభావం మరోసారి చర్చకు వచ్చేలా చేశాయి. న్యూజిలాండ్‌పై గెలుపుని వీరిద్దరూ ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయిు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఒకే కారులో బయటకు వెళ్లారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇరువురూ కారు ఎక్కుతూ కనిపించారు. ఎక్కడికి వెళ్లారు, ఏమిటి సంగతి? అన్న వివరాలు చెప్పలేదు. ఈ వీడియో ఎప్పుడు తీశారో తెలియరాలేదు. ఏదేమైనా వరల్డ్ కప్ వేళ ఆటగాళ్ల మధ్య ఇలాంటి సానుకూల వాతావరణం జట్టుకు ఉపయోగపడుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

More Telugu News