Raghu Rama Krishna Raju: నరసాపురం బరిలో కృష్ణంరాజు భార్య అంటూ కథనం... స్పందించిన రఘురామకృష్ణరాజు

  • కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి వైసీపీ టికెట్ అంటూ కథనం
  • ఎవరో ఒకరు పోటీ చేయాల్సిందే కదా అంటూ రఘురామ వ్యాఖ్యలు
  • కృష్ణంరాజు కుటుంబంతో తనకు చాలా సాన్నిహిత్యం ఉందని వెల్లడి
  • తెలిసినవాళ్లు పోటీ చేస్తే ఇంకా మంచిదని వివరణ
Raghurama comments on news that Krishnamraju wife will contest in Narasapuram

వచ్చే ఎన్నికల్లో నరసాపురం లోక్ సభ స్థానం బరిలో వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలను బరిలో దింపుతున్నట్టు ఓ పత్రికలో కథనం వచ్చింది. దీనిపై రఘురామను మీడియా స్పందన కోరింది. 

అందుకాయన బదులిస్తూ, ఎన్నికలు, నియోజకవర్గం అన్న తర్వాత ఎవరో ఒకరు పోటీ చేయాల్సిందేగా అని వ్యాఖ్యానించారు. టాలీవుడ్ లో చాలామంది పెద్ద హీరోలు తన నియోజకవర్గానికి చెందినవారేనని రఘురామ వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్, రవితేజ... ఇలా చాలామందే ఉన్నారని తెలిపారు. 

కృష్ణంరాజు గారి శ్రీమతి గారు పోటీ చేస్తే మంచిదేనని అన్నారు. వారి కుటుంబంతో తనకెంతో సాన్నిహిత్యం ఉందని పేర్కొన్నారు. తెలిసిన వాళ్లపై పోటీ చేయడం వల్ల ఓ ప్రయోజనం ఉందని, వారు మనల్ని విమర్శించరు, మనం వాళ్లను విమర్శించాల్సిన పని ఉండదు... ఎవరి ప్రచారం వాళ్లు చేసుకుంటూ వెళ్లిపోతాం అని వివరించారు. 

జగన్ మోహన్ రెడ్డి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని, ఆయనకు అభ్యర్థులు దొరకడంలేదని ఎద్దేవా చేశారు. మగవాళ్లెవరూ పోటీ చేయడానికి ముందుకు రావడంలేదని తెలిసిందని, అందుకే ఆడవాళ్ల కోసం ప్రయత్నం చేస్తున్నాడేమో అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. నరసాపురంలో ఎవరు పోటీ చేసేందుకు వచ్చినా ఆహ్వానిస్తానని రఘురామకృష్ణరాజు వెల్లడించారు. 

ఒకవేళ జగన్ విశాఖలో పోటీ చేస్తే నేను నరసాపురంతో పాటు అక్కడ కూడా పోటీ చేస్తానేమో అని రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.

More Telugu News