Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మహిళపై మరో ఇద్దరు మహిళల లైంగికదాడి

  • రహ్మత్‌నగర్ ప్రాంతంలో ఘటన
  • భర్తతో గొడవపడి బస్టాండ్‌లో నిద్రించిన బాధితురాలితో మాటలు కలిపిన మహిళలు
  • మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి మత్తమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చిన వైనం
  • మత్తులోకి జారుకోగానే లైంగికదాడి
  • ఆపై నాలుగు తులాల బంగారు గొలుసు, చెవికమ్మల దోపిడీ
Two Women sexually Harassed another woman

హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చిన ఓ మహిళపై మరో ఇద్దరు మహిళలు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (38) ఈ నెల 13న భర్తతో గొడవపడి మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ రాత్రి యూసుఫ్‌గూడ బస్టాండ్ వద్ద నిద్రిస్తుండగా గమనించిన ఇద్దరు మహిళలు.. ఆమెను పలకరించి విషయం అడిగి తెలుసుకున్నారు. 

ఆపై ఇక్కడ ఉండడం మంచిది కాదని, తమ ఇంట్లో పడుకుని ఉదయం వెళ్లిపోవాలని చెబుతూ బ్రహ్మశంకర్‌నగర్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడామెకు కూల్‌డ్రింక్ ఇచ్చారు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. మత్తులో ఉన్న ఆమెపై వీరిద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. శరీరమంతా గోళ్లతో రక్కి గాయపర్చారు. ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు లాక్కున్నారు.

వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని భర్తకు చెప్పింది. గాయాలతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్చిన భర్త అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాధితురాలు నిన్న మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసహజ శృంగారంతోపాటు దోపిడీ, దొంగతనాలకు వారిద్దరూ పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

More Telugu News