Atchannaidu: అమ్మవారిని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నా: అచ్చెన్నాయుడు

  • ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న అచ్చెన్నాయుడు
  • చంద్రబాబు విడుదలవ్వాలని కోరుకున్నట్టు వెల్లడి
  • కరవు నుంచి ఏపీ ప్రజలు బయటపడాలని ప్రార్థించానని వివరణ
Atchannaidu offers prayers at Vijayawada Durga Temple

తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నేడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ అమ్మవారిని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నానని తెలిపారు. 44 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబు విడుదల కావాలని, కరవు బారిన పడిన రాష్ట్ర ప్రజలు కోలుకునే శక్తిని ఇవ్వాలని తల్లిని ప్రార్థించాను అని వెల్లడించారు. 

చంద్రబాబు తెలుగు జాతి ఆస్తి అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు పిల్లల ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా చేసిన వ్యక్తి చంద్రబాబు అని, తెలుగు జాతి ముందుండాలని భావించే వ్యక్తి అని కొనియాడారు. సమాజానికి ఉపయోగపడే చంద్రబాబు వంటి వ్యక్తి జైల్లో ఉండకూడదని, ఆయన బయటికి వచ్చేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు వివరించారు. 

ఇక, వందేళ్ల భారతదేశ చరిత్రలో ఎన్నడూ చూడనంత కరవు పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి తగిన నీళ్లు లేవని, పశుగ్రాసం కూడా లేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కరవు బారి నుంచి ప్రజలు త్వరగా బయటపడాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు.

More Telugu News