India: బలపడుతున్న తేజ్ తుఫాను.. గుజరాత్‌కు ఐఎండీ అలర్ట్..

  • ఆదివారం మధ్నాహ్నానికి మరింత తీవ్రం
  • తీవ్ర తుఫానుగా  మారే అవకాశం
  • భారత్‌లో గుజరాత్‌పై ప్రభావం
Cyclone Tej is getting stronger says IMD

భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. ఆగ్నేయ, నైరుతి అరేబియా సముద్రంలో ఏర్పడిన తేజ్ తుఫాను మరింత తీవ్రంగా బలపడుతోందని ప్రకటించింది. అల్పపీడనం క్రమంగా తుఫానుగా మారిందని, ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారుతోందని ఐఎండీ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నానికి మరింతగా బలపడి, తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపింది.

ఇక ప్రస్తుతం తేజ్‌ తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు గరిష్ఠంగా 62 నుంచి 88 కి.మీ వేగంతో వీస్తున్నాయని ఐఎండీ వివరించింది. ఈ గాలుల వేగం 89 - 117 కి.మీ.లకు చేరితే తీవ్ర తుఫానుగా పరిగణిస్తారు.

కాగా.. ఈ తుఫాను భారత్‌లోని గుజరాత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతుండడంతో రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంపై అంతగా ప్రభావం చూపకపోవచ్చునని లెక్కగట్టింది. అయితే తీవ్ర తుఫానుగా మారి ఒమన్, దాని పక్కనే ఉన్న యెమెన్ దక్షిణ తీరాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. దిశను మార్చుకునే అవకాశం కూడా ఉండడంతో ఎక్కడ తీరం దాటుతుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని వివరించారు.

More Telugu News