Medigadda Barrage Bridge: పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన!

  • శనివారం పొద్దుపోయాక ఘటన
  • 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య అడుగు మేర కుంగిన వైనం
  • డ్యాం పరిసరాల్లో అలర్ట్ ప్రకటించిన ఇంజినీర్లు 
  • వంతెన మీదుగా మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకల నిలిపివేత
  • సమస్య ఏంటో తెలుసుకునేందుకు డ్యాంలో నీటిని ఖాళీ చేస్తున్న వైనం
  • అసాంఘిక శక్తుల పాత్ర ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఇంజినీర్ల ఫిర్యాదు
Medigadda barrage bridge slight slagged

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన శనివారం పొద్దుపోయాక పెద్ద శబ్దంతో కుంగింది. బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య వంతెన ఒక అడుగు మేర కుంగిందని ఇంజినీర్లు చెబుతున్నారు. బ్యారేజీ 20వ పిల్లరు కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్టు వెల్లడించారు.

ఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర నుంచి 356 మీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య బ్యారేజీ వంతెన మీదుగా వాహనరాకపోకలను నిలిపివేశారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసర ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. 

వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలోకి 25 వేల క్యూసెక్కుల వరకూ ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి నీటిని కిందకు వదులుతున్నారు. అయితే, అకస్మాత్తుగా పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఆ సమయంలో మరిన్ని శబ్దాలు రావడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. 

వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలో 10.17 టీఎంసీల నీరు ఉంది. వంతెన పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలు. దీంతో, ముందు జాగ్రత్తగా ఇంజినీర్లు జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొత్తం 46 గేట్ల నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు కిందకు వదులుతున్నారు. వంతెన కుంగిన ప్రాంతం దిగువన ఉన్న బ్యారేజీకి ఏమైనా నష్టం జరిగిందా? అన్న అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. 

ఇదిలా ఉంటే, ఎల్‌ఎండ్‌టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున ఏమైనా మరమ్మతులు అవసరమైతే చేపడతామని ఇంజినీర్ ఇన్ చీఫ్ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. అసాంఘిక శక్తుల ప్రమేయమేమైనా ఉండొచ్చనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఇంజినీర్లను ఆదేశించినట్టు తెలిపారు. గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదనీరు ఎదుర్కొన్నా రాని శబ్దాలు ఇప్పుడు రావడంపై పరిశీలిస్తున్నామన్నారు.

More Telugu News