Chandrababu: చంద్రబాబు అరెస్ట్ పై 39వ రోజు కూడా కొనసాగిన నిరసనలు... ఫొటోలు ఇవిగో!

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిరసనలతో హోరెత్తిస్తున్న టీడీపీ శ్రేణులు
  • చంద్రబాబు విడుదల కావాలంటూ నేడు దేవాలయాల్లో పూజలు
TDP protests continues on 39th day

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు వరుసగా 39వ రోజు కూడా కొనసాగాయి. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 14వ రోజున సైకిల్ యాత్ర  చేపట్టారు.

కొత్తపేటలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు కుమారుడు బండారు సంజీవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొత్తూరు సెంటర్ హనుమాన్ ఆలయం నుంచి చింతలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం, మోకాళ్ళపై చింతలూరు వెంకటేశ్వర స్వామి ఆలయ మెట్లను ఎక్కి శ్రీనివాసుని దర్శించుకున్నారు. 

అనంతపురం అర్బన్ లో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వప్న ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రపురంలో తెలుగు మహిళలు బాలాత్రిపుర సుందరి సమేత అగస్త్యేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కదిరిలో మరకత మహాలక్ష్మి అమ్మవారికి తెలుగుదేశం పార్టీ మహిళ నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

కోనసీమ జిల్లా ఆలమూరు మండల కేంద్రంలో తెలుగు మహిళలు జనార్థన స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని వేదపారాయణం చేసి చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదల కావాలని జనార్థనస్వామిని ప్రార్థించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55వ డివిజన్ లో కనకదుర్గమ్మ వారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు జరిపించారు. 

చిలకలూరిపేట నియోజకవర్గం గణపవరంలో శ్రీపతి అనే తెలుగుదేశం కార్యకర్త చంద్రబాబుపై ప్రత్యేక అభిమానం చాటుకుంటూ వినూత్న నిరసన చేశారు. శ్రీపతి మనవరాలు శివజోషిత ఓణీల మహోత్సవం జరిగింది. జోషిత కుటుంబసభ్యులు, తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్తిపాటి చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని సంఘీభావం తెలిపారు.

More Telugu News