AP Hates Jagan: నాలుగున్నరేళ్ల జగన్ దుర్మార్గపు పాలన, ప్రజల అంతరంగానికి అక్షర రూపమే ఈ పుస్తకం: అచ్చెన్నాయుడు

  • సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై టీడీపీ పుస్తకం
  • టీడీపీ ప్రధాన కార్యాలయంలో 'ఏపీ హేట్స్ జగన్' పుస్తకావిష్కరణ
  • సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అచ్చెన్నాయుడు
Atchannaidu launches AP Hates Jagan book

సీఎం జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై తెలుగుదేశం పార్టీ 24 పేజీలతో ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం తీసుకువచ్చింది. టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పుస్తకాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, బొండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, కే.ఎస్.జవహర్, గద్దె రామ్మోహన్ రావు, పంచుమర్తి అనురాధ, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పుస్తకావిష్కరణ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, జగన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీల జాబితా చాంతాడంత ఉంటే, నెరవేర్చింది కేవలం చారడంతేనని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్ల జగన్ పాలన ఆసాంతం అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు, దుర్మార్గాలు, దోపిడీల మయమని ప్రజలకు అర్థమైందని అన్నారు. 

తన ప్రభుత్వ అవినీతి, తాను చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తూ, వారిలో చైతన్యం తీసుకు వస్తున్నాడన్న అక్కసుతోనే చంద్రబాబును జగన్ రెడ్డి అన్యాయంగా జైలుకు పంపాడని ఆరోపించారు. 

జగన్ రెడ్డి నయవంచన పాలనకు అక్షరరూపమే 24 పేజీల ‘ఏపీ హేట్స్ జగన్’ పుస్తకం అని స్పష్టం చేశారు. ప్రజలంతా టీడీపీ విడుదల చేసిన ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని చదివాలని, జగన్ నిజస్వరూపాన్ని, వైసీపీ ప్రభుత్వ కపట నైజాన్ని తెలుసుకోవాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

బిడ్డ అంటే నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచేవాడా జగన్ రెడ్డీ...?

నేను మీ బిడ్డను అంటూ ఈ మధ్య జగన్ కొత్త రాగం ఎత్తుకున్నాడు. బిడ్డ అంటే తల్లిదండ్రుల్ని, ఇతర కుటుంబసభ్యుల్ని, తనను నమ్మిన వారిని బాగా చూసుకోవాలి. కానీ జగన్ ఇప్పటివరకు చేసింది, చేస్తున్నది అంతా అందుకు పూర్తి విరుద్ధం. బిడ్డ అంటే నమ్మిన వారిని నట్టేట ముంచేవాడా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. బిడ్డ అంటే రాష్ట్రానికి తీరని అన్యాయం... ప్రజలకు తీవ్ర ద్రోహం చేయడమేనా జగన్ రెడ్డి? ఎన్నికలకు ముందు మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ తో సమానమని చెప్పిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని నెరవేర్చకుండానే అన్నీ చేసేశానని ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

మంత్రి బొత్స, నేడు రుషికొండపై జగన్ రెడ్డి నిర్మిస్తున్న రాజప్రాసాదంపై నోరు మెదపడేం?

రాజధాని అమరావతిని సర్వనాశనం చేసిన జగన్ నేడు ఉత్తరాంధ్రను దోచుకోవడానికే తన మకాంను విశాఖపట్నానికి మారుస్తున్నాడు. రుషికొండపై ప్రజల సొమ్ముతో విలాసవంతమైన రాజప్రాసాదాన్ని నిర్మించుకుంటున్నాడు. గతంలో రాజధాని నిర్మాణంపై పిచ్చికూతలు కూసిన మంత్రి బొత్స సత్తిబాబు నేడు రుషికొండపై ముఖ్యమంత్రి కోసం నిర్మిస్తున్న భారీ ప్యాలెస్ పై నోరు మెదపడేం? అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలకు చదరపు అడుగుకి రూ.6 వేలు చెల్లిస్తేనే అవినీతి చేశారని గగ్గోలు పెట్టిన వైసీపీనేతలు... నేడు జగన్ రెడ్డి చదరపు అడుగుకి రూ.28 వేలు చెల్లిస్తుంటే నోరు ఎత్తరేం? జగన్ రెడ్డి బాత్రూమ్ లకు, టాయిలెట్ల నిర్మా ణానికి వేలకోట్ల ప్రజలసొమ్ము తగలేస్తారా? 

సముద్రం పక్కన విలాసవంతంగా జీవించడానికే జగన్ విశాఖ వెళ్తున్నాడు

ఉత్తరాంధ్రప్రజలు అమాయకులు... వారిముందు తమ ఆటలు సాగుతాయన్న ఆలోచనతోనే జగన్ విశాఖపట్నంలో కాపురం పెట్టబోతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలు నాలుగున్నరేళ్లుగా తమను పట్టించుకోని జగన్ రెడ్డికి, అతని ప్రభుత్వానికి కర్రుకాల్చి వాతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం సముద్రం పక్కన విలాసవంతమైన జీవితం గడపడానికే జగన్ విశాఖపట్నానికి వెళ్తున్నాడు. చంద్రబాబునాయుడి కంటే తాను దేనిలో మెరుగో జగన్ రెడ్డి చెప్పాలి.  జగన్ రాష్ట్రానికి పట్టిన శని అని ప్రజలంతా భావిస్తున్నారు” అని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

More Telugu News