Rahul Gandhi: దోశ వేసి ఆశ్చర్యపరిచిన రాహుల్ గాంధీ

  • జగిత్యాల జిల్లాలో ప్రచారం సందర్భంగా కనిపించిన దృశ్యం
  • నేటితో తెలంగాణలో మూడో రోజుకు చేరిన పర్యటన
  • నేడు ఆర్మూరులోనూ విజయభేరి యాత్ర
Viral Rahul tries his hand at dosa making in Telangana

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో విద్యలు ప్రదర్శిస్తుంటారు. పొలాల్లో రైతులతో కలసి దుక్కి దున్నడం, చెప్పులు కుట్టడం.. ఇలాంటివి ఎన్నో గతంలో చూశాం. కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ సైతం ఇలాంటి చర్యలనే అనుసరిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరిగే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రాహుల్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జిగిత్యాల జిల్లాలో విజయభేరి యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా కొండగట్టులో రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్లోకి ప్రవేశించారు. 

పెనంపై పిండి వేసి, మసాలా దోశ తయారు చేశారు. తాను సైతం దోశ వేయగలనని నిరూపించుకున్నారు. రాహుల్ చర్య స్థానికులను ఆకర్షించింది. హోటల్ నిర్వాహకుడికి ఎంత ఆదాయం వస్తోంది, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో రాహుల్ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి కరీంనగర్ లో బస చేసిన ఆయన, శుక్రవారం ఉదయం జగిత్యాలకు ప్రయాణమయ్యారు. విజయభేరి బస్సు యాత్రలో భాగంగా నేడు ఆర్మూరులోనూ రాహుల్ పర్యటించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

More Telugu News