Chandrababu: పైబర్ నెట్ కేసు: చంద్రబాబు పిటిషన్ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

  • వాదనలు వినిపించిన సిద్ధార్థ్ లూథ్రా.. నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసిన కోర్టు
  • అప్పటి వరకు యధాతధ స్థితిని కొనసాగించాలని ఆదేశం 
  • ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంను ఆశ్రయించిన చంద్రబాబు
  • నేడు ఏసీబీ కోర్టులో నాలుగు పిటిషన్లపై విచారణ
chandrababu bail petition postponed in Supreme court

పైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లాయర్ సిద్ధార్థ లూథ్రా అభ్యర్థన మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ప్రకటించింది. అప్పటి వరకు గతంలో ఇచ్చిన అండర్ టేకింగ్ కొనసాగించాలని ఆదేశించింది. 

సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయ్యాక చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయగా ఒక దానిపై తీర్పును కోర్టు రిజర్వ్ చేసిందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో విచారణను వాయిదా వేయాలని కోర్టును అభ్యర్థించారు. దీనిపై ప్రభుత్వ లాయర్ స్పందిస్తూ.. కస్టడీలో ఉన్న వ్యక్తికి సంబంధించి అరెస్టు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు. ఆ కేసులోనూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని తాము దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లోనూ పేర్కొన్నట్లు వివరించారు. దీంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

పైబర్ నెట్ కేసులో మిగతా అందరికీ బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. చంద్రబాబు పిటిషన్ ను మాత్రం తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు తరఫు లాయర్లు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను శుక్రవారం విచారణకు రాగా.. జస్టిన్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఏం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందు చంద్రబాబు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో శుక్రవారం చంద్రబాబుకు సంబంధించి నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.

More Telugu News