Virat Kohli: కోహ్లీ సెంచరీకి ముందు ఏం జరిగింది?.. ఆసక్తికర విషయాన్ని పంచుకున్న కేఎల్ రాహుల్

  • బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించిన కోహ్లీ
  • సెంచరీ సాధ్యం కాదనుకున్న కోహ్లీ
  • కేఎల్ రాహుల్ అండతో శతకం పూర్తి
  • అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తిచేసుకున్న క్రికెటర్‌గా విరాట్
KL Rahul reveals interesting conversation with Virat Kohli

ప్రపంచకప్‌లో భాగంగా గతరాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఈజీ విక్టరీ సాధించింది. కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయ సెంచరీ (103) సాధించి తన ఖాతాలో 78వ సెంచరీని వేసుకున్నాడు. కోహ్లీ శతకం బాదడానికి ముందు తమ ఇద్దరి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణను కేఎల్ రాహుల్ వెల్లడించాడు.
  
కోహ్లీ 80 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నప్పుడు.. జట్టు విజయానికి కావాల్సింది 20 పరుగులే. ఏ రకంగా చూసినా కోహ్లీ సెంచరీ కష్టమే. అయితే, రాహుల్ పట్టుబట్టడంతో చివరికి నాసుమ్ అహ్మద్ వేసిన 43వ ఓవర్‌లో సిక్సర్ కొట్టి సెంచరీ పూర్తిచేసుకోవడంతోపాటు జట్టుకు విజయాన్ని కూడా అందించాడు. 

మ్యాచ్ పూర్తయిన తర్వాత రాహుల్ మాట్లాడుతూ.. సింగిల్ తీసేందుకు తాను నిరాకరించానని తెలిపాడు. అప్పుడు కోహ్లీ.. ‘‘సింగిల్ తీయకపోతే జనం తప్పుగా అనుకుంటారు. జట్టు కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆడుతున్నట్టు భావిస్తారు’’ అని చెప్పాడు. దీనికి నేను.. మనం ఇప్పుడు విజయానికి చాలా దగ్గర్లో ఉన్నాం. ఏం కాదు కానీ, నువ్వైతే షాట్స్ బాదెయ్ అని చెప్పాను. చివరికి కోహ్లీ సాధించాడు’’ అని రాహుల్ చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 48వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో 26 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదు, అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు.

More Telugu News