Australia: వరల్డ్ కప్ లో ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా

  • టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిన ఆసీస్
  • నేడు శ్రీలంకతో మ్యాచ్
  • 5 వికెట్ల తేడాతో నెగ్గిన కంగారూలు
  • 210 పరుగుల లక్ష్యాన్ని 35.2 ఓవర్లలో ఛేదించిన ఆసీస్
Australia registers first win in world cup

గతంలో ఐదు పర్యాయాలు వరల్డ్ కప్ నెగ్గి, ఈ వరల్డ్ కప్ లోనూ ఫేవరెట్ గా బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు ఎట్టకేలకు టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఓడిన ఆసీస్... రెండో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలోనూ పరాజయం పాలైంది. దాంతో వరుసగా రెండు ఓటములతో తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన ఆసీస్ కు ఊరట లభించింది. లక్నోలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో నెగ్గి బోణీ కొట్టింది. 

ఈ మ్యాచ్ లో మొదట శ్రీలంక టాస్ గెలిచి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 58 పరుగులు, ఓపెనర్ మిచెల్ మార్ష్ 52 పరుగులు చేశారు. మార్నస్ లబుషేన్ (40), గ్లెన్ మ్యాక్స్ వెల్ (30 బ్యాటింగ్), మార్కస్ స్టొయినిస్ (20 బ్యాటింగ్) జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 

లంక బౌలర్లులో దిల్షాన్ మధుశంక 3 వికెట్లతో రాణించాడు. అతడికి మిగతా బౌలర్ల నుంచి సహకారం కొరవడింది. ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లతో రాణించిన ఈ పిచ్ పై శ్రీలంక స్పిన్నర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. యువ స్పిన్నర్ దునిత్ వెల్లాలగే ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.

More Telugu News