Telangana: విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త... జేబీఎస్ మీదుగా బస్సులు

  • అక్టోబర్ 18 నుంచి జేబీఎస్ మీదుగా ప్రయాణించనున్న బస్సులు
  • మియాపూర్ నుంచి బయలుదేరే 24 బస్సులు ఇక జేబీఎస్ మీదుగా...
  • ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ట్వీట్
Vijayawada buses via JBS from October 18

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు మియాపూర్ నుంచి వెళ్లే బస్సులను జేబీఎస్ మీదుగా నడపాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ట్వీట్ చేశారు. విజయవాడకు వెళ్లే బస్సుల్లో ఎక్కువగా ఎంజీబీఎస్‌లో ప్రారంభమవుతాయి. అల్వాల్, శామీర్‌పేట తదితర ప్రాంతాల నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులు ఎంజీబీఎస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా ఇక మీదట జేబీఎస్ మీదుగా నడపనుంది. మియాపూర్ నుంచి కేపీహెచ్‌బీ కాలనీ, బాలానగర్, బోయినపల్లి, జేబీఎస్, సంగీత్, తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి. అక్టోబర్ 18 బుధవారం నుంచి ఈ సర్వీసులు జేబీఎస్ మీదుగా ప్రయాణిస్తాయి. బస్సు చార్జీల్లో పెద్దగా మార్పు లేదు.

More Telugu News