Posani Krishna Murali: చంద్రబాబుకు భువనేశ్వరి మంచి భోజనం పంపించడం లేదా?: పోసాని కృష్ణమురళి

  • చంద్రబాబు జైల్లో ఉంటే లోకేశ్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని ప్రశ్న
  • అమిత్ షాపై రాళ్లు వేయించి ఇప్పుడు కలవడం విడ్డూరమన్న పోసాని
  • పవన్, లోకేశ్‌లు రాజకీయాలకు పనికి రారన్న పోసాని కృష్ణమురళి
Posani Krishna Murali on Nara Chandrababu Naidu food

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ కేడర్ ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. టీడీపీ నేతల వ్యాఖ్యలపై వైసీపీ కూడా దీటుగా స్పందిస్తోంది. ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి కూడా వారి వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబుకు ఇంటి భోజనమే వస్తోందని, అలాంటప్పుడు నారా భువనేశ్వరి మంచి భోజనం, మందులు పంపించడం లేదా? అని ప్రశ్నించారు.

ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండులో ఉన్నది జగన్ కాదని, చంద్రబాబు అని, అలాంటప్పుడు లోకేశ్ ఢిల్లీలో ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. అమిత్ షాను కలిసేందుకు లోకేశ్‌కు సిగ్గులేదా? అని ధ్వజమెత్తారు. అప్పుడు అమిత్ షాపై రాళ్లు వేయించి ఇప్పుడు కలవడం విడ్డూరమన్నారు. లోకేశ్ ఆడే డ్రామాలు అమిత్ షాకు తెలియకుండా ఉంటాయా? అన్నారు. కమ్మ కులం వారిని రెచ్చగొట్టేందుకు లోకేశ్, భువనేశ్వరి అబద్ధాలు చెబుతున్నారన్నారు.

జైల్లో ఉన్న చంద్రబాబు నిరంతరం పోలీసులు, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారన్నారు. కాంగ్రెస్ అలవాట్లను బీజేపీకి అంటించాలని పురందేశ్వరి అనుకుంటున్నారన్నారు. అమిత్ షాపై రాళ్లు వేయించిన లోకేశ్‌ను ఆయన వద్దకు తీసుకువెళ్లారని, మోదీని నీచంగా తిట్టిన చంద్రబాబు కోసం పురందేశ్వరి తాపత్రయపడటం ఏమిటన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, లోకేశ్‌లు రాజకీయాలకు పనికి రారన్నారు. బట్టలు విప్పుతాం, కొడతామంటే ప్రజలు ఛీకొడుతున్నారన్నారు.

More Telugu News