కేసీఆర్, జగన్ కలిసినప్పుడు. చంద్రబాబు, పవన్ కలిస్తే తప్పేంటి?: బుద్దా వెంకన్న

  • టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని వెంకన్న ప్రశ్న
  • వైసీపీ ఇబ్బందులను సహించలేకే లోకేశ్ ను అమిత్ షా వద్దకు పురందేశ్వరి తీసుకెళ్లారని వెల్లడి
  • సజ్జల ఒక అబద్దాల పుట్ట అని విమర్శ
టీడీపీ, జనసేన పొత్తుపై వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ తో జగన్ కలవడాన్ని వైసీపీ నేతలు గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన అన్నారు. కేసీఆర్, జగన్ కలిసినప్పుడు... చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఎందుకు ఉలిక్కి పడుతోందని ఎద్దేవా చేశారు. 

కుటుంబ విలువల గురించి ఎన్టీఆర్ బిడ్డలకు బాగా తెలుసని... అందుకే లోకేశ్ ను అమిత్ షా వద్దకు పురందేశ్వరి తీసుకెళ్లారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేశ్ ను ఇబ్బంది పెడుతున్నారని.. అలాగే తన సోదరి భువనేశ్వరిని, కోడలు బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెడుతుండటాన్ని పురందేశ్వరి గమనిస్తున్నారని తెలిపారు. వీటిని సహించలేకే లోకేశ్ ను అమిత్ షా వద్దకు తీసుకెళ్లారని చెప్పారు. జగన్ కనుసన్నల్లో జరుగుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను అమిత్ షాకు వివరించారని తెలిపారు. 

ఏనాడూ చట్ట సభల్లోకి అడుగుపెట్టని సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం తెలుసని వెంకన్న ప్రశ్నించారు. స్కిల్ డెవలప్ మెంట్ గురించి మాట్లాడే అర్హత కూడా సజ్జలకు లేదని అన్నారు. సజ్జల ఒక అబద్ధాల పుట్ట అని... కుట్రలకు పాల్పడుతూ చంద్రబాబుపై దొంగ అనే ముద్ర వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ వస్తున్నాడని వైజాగ్ ప్రజలు హడలిపోతున్నారని వెంకన్న అన్నారు. గతంలో విజయమ్మను వైజాగ్ ప్రజలు ఓడించారని చెప్పారు. దమ్ముంటే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. లోకేశ్ గతంలో ఓడిన మంగళగిరిలోనే పోటీ చేసి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News

Mandali Buddaprasad Nara Lokesh Chandrababu Telugudesam Pawan Kalyan Janasena Jagan Sajjala Ramakrishna Reddy YSRCP Amit Shah Daggubati Purandeswari BJP