Nara Lokesh: మా అమ్మ భువనేశ్వరి ఐటీ రిటర్నులు వీళ్ల చేతికి ఎలా వచ్చాయో తేల్చుకుంటా: లోకేశ్

  • ఇన్నర్ రింగ్ రోడ్డులో లోకేశ్ పై ఆరోపణలు
  • ఇవాళ రెండో రోజు కూడా లోకేశ్ పై సీఐడీ విచారణ
  • విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేశ్
  • తన ముందు నారా భువనేశ్వరి ఐటీ డాక్యుమెంట్ ను పెట్టారని వెల్లడి
  • ఆ పత్రం అధికారికంగా వచ్చిందో, అనధికారికంగా వచ్చిందో తెలియాల్సి ఉందని వ్యాఖ్యలు
Lokesh second day CID questioning concluded

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి రెండో రోజు నారా లోకేశ్ సీఐడీ విచారణ ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించారని వెల్లడించారు. ఒక్క రోజు విచారణకు హాజరవ్వాలని హైకోర్టు చెప్పినా, సీఐడీ అధికారులు తనను రెండో రోజు కూడా విచారణకు పిలిచారని తెలిపారు. సీఐడీ అధికారుల కోరిక మేరకు తాను ఇవాళ కూడా విచారణకు వచ్చానని పేర్కొన్నారు. 

నిన్న అడిగిన ప్రశ్నలనే వాషింగ్ మెషీన్ లో వేసి, అటు తిప్పి ఇటు తిప్పి అడిగారని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. ఇవాళ 47 ప్రశ్నలు అడిగితే, వాటిలో రెండో, మూడో కొత్త ప్రశ్నలు అని, మిగతావన్నీ పాత ప్రశ్నలేనని వెల్లడించారు. ఇవాళ తనను 6 గంటల పాటు ప్రశ్నించారని తెలిపారు. 

"ఇవాళ విచారణ సందర్భంగా నా ముందు ఓ డాక్యుమెంట్ పెట్టారు. అది మా అమ్మ నారా భువనేశ్వరి ఐటీ రిటర్నులకు సంబంధించిన పత్రం. ఇది మీ వద్దకు ఎలా వచ్చిందని సీఐడీ అధికారులను ప్రశ్నించాను. వారి నుంచి సరైన సమాధానం రాలేదు. ఈ కేసులో మా అమ్మ నిందితురాలు కాదు... ఆమె ఐటీ రిటర్నులు మీ వద్ద ఎందుకున్నాయని దర్యాప్తు అధికారిని సూటిగా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. దీన్ని నేను సీరియస్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 

నిందితురాలు కానటువంటి వ్యక్తి ఐటీ రిటర్నులు ఏపీ ప్రభుత్వం చేతికి అధికారికంగా వచ్చాయా? అనధికారికంగా వచ్చాయా? అనేది తెలియాల్సి ఉంది. దీని వెనుక ఎవరున్నారో నిగ్గు తేల్చేందుకు ఐటీ శాఖకు లేఖ రాస్తాను. 

ఇవాళ్టి విచారణలో నా శాఖకు సంబంధం లేని ప్రశ్నలు కొన్ని అడిగారు. అవి నా శాఖకు సంబంధించినవి కావని, వాటిపై నాకు అవగాహన లేదని సీఐడీ అధికారులకు చెప్పాను. వాస్తవానికి ఇవాళ్టి విచారణ గురించి మీడియాకు చెప్పాల్సిన కొత్త  విషయాలు కూడా ఏమీ లేవు. ఇవాళ మరోసారి లవ్ లెటర్ (41ఏ నోటీసు) ఇస్తారేమో అనుకున్నాను. ఈ కేసులో ఇప్పటికే రెండుసార్లు లవ్ లెటర్ (41ఏ నోటీసు) ఇచ్చారు కదా.... మూడోది కూడా ఇస్తారా? అని దర్యాప్తు అధికారిని అడిగాను. అందుకాయన సమాధానం చెప్పలేదు" అని లోకేశ్ వివరించారు. 

"రాజధాని ఈ ప్రాంతంలో రావాలని 2014లో ఎవరు నిర్ణయించారు? రాజధాని మాస్టర్ డెవలపర్ ఎవరు? సీడ్ కాపిటల్ ప్రతిపాదన ఎవరిచ్చారు? ఏపీసీఆర్డీఏ ఎవరు ఏర్పాటు చేశారు? ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ఎవరు నిర్ణయించారు?... అంటూ ఈ ప్రశ్నలు అడిగారు. ఇవేవీ నా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించినవి కావు. 

నాడు ఏపీ సీఆర్డీఏలో కొందరు లే అవుట్లు వేసుకునేందుకు ఇబ్బంది పడుతుండడంతో, దాన్ని పరిష్కరించేందుకు మంత్రుల సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అది నేను మంత్రిని కాకముందు ఏర్పాటైన మంత్రుల సంఘం. 99 ప్లాట్లకు సంబంధించి కోర్టు ఆదేశాల మేరకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. అంతే తప్ప కొత్తగా ఏమీ లేదు. దాంట్లో రింగ్ రోడ్డు అలైన్ మెంట్ గురించి ఏమీ లేదు" అని లోకేశ్ స్పష్టం చేశారు.

More Telugu News