Atchannaidu: జగన్ వాటిని కూడా తప్పుబడుతున్నాడు: అచ్చెన్నాయుడు

  • ఎలక్టోరల్ బాండ్ల ద్వారా టీడీపీకి నిధులు
  • స్కిల్ నిధులు మళ్లించారని జగన్ ఆరోపిస్తున్నాడని అచ్చెన్న ఆగ్రహం
  • కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నాడని విమర్శలు
Atchannaidu take a dig at CM Jagan

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై ఏపీ సీఐడీ మోపిన ఆరోపణల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్స్ సేకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ చట్టం కూడా చేసిందని అన్నారు. కానీ జగన్ రెడ్డి వాటిని కూడా తప్పుబడుతూ, అదో కుంభకోణం అన్నట్లుగా మాట్లాడుతూ కేంద్ర చట్టాలను అపహాస్యం చేస్తున్నాడని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 

చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి ఉంచడానికి కుట్ర చేస్తున్నారని ఈ వ్యాఖ్యలతోనే అర్ధమవుతోందని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం ద్వారా ప్రజాహక్కుల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని వివరించారు. 

"స్కిల్ డెవలప్ మెంట్‌కి సంబంధించి రూ.27 కోట్ల నిధులు తెలుగుదేశం పార్టీ ఖాతాకు మళ్లించారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయ పార్టీకి రూ.20 వేలకు మించి నగదు రూపంలో విరాళం ఇచ్చినట్లైతే అలాంటి వివరాలన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటుకు సదరు పార్టీ వారు తెలియజేస్తారు. అవి ఎన్నికల కమిషన్ వెబ్ సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంటాయి. 

ఏప్రిల్ 2023లో ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ నుండి తెలుగుదేశం పార్టీ నిధుల వివరాలను సీఐడీ అధికారికంగా డౌన్ లోడ్ చేసింది. అందులోనే ఎవరు ఏ రోజు ఎంత మొత్తంలో విరాళాలిచ్చారో స్పష్టంగా ఉంది. 

వాటిపై ఆరు నెలల పరిశోధన చేసిన సీఐడీ, ఎలాంటి అవకతవకలు లేకున్నా బురద జల్లడమే లక్ష్యంగా పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెప్పడం, దానిని అక్రమ కేసులకు ముడిపెట్టడం దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్ట వ్యతిరేకంగా పని చేస్తున్నాయని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం" అన్నారు.

More Telugu News