america: భారత్‌తో సంబంధాలు దెబ్బతింటాయన్న వార్తలపై అమెరికా తీవ్ర స్పందన

  • భారత్‌తో సంబంధాలు మరింత దిగజారవచ్చునని అమెరికా రాయబారి చెప్పినట్లుగా కథనాలు
  • ఈ కథనాన్ని ఖండించిన అమెరికా ఎంబసీ
  • భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు పని చేస్తున్నట్లు ప్రకటన
US Rejects Report Claiming India Canada Row May Hit Delhi Washington Ties

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో న్యూఢిల్లీకి, వాషింగ్టన్ డీసీకి మధ్య సంబంధాలు దిగజారుతున్నాయనే వార్తలను అమెరికా తీవ్రంగా ఖండించింది. వాషింగ్టన్ కు చెందిన వార్తా సంస్థ పొలిటికోలో 'వై బైడెన్ మమ్ ఆన్ ది ఇండియా-కెనడా స్పాట్' అనే శీర్షికతో వచ్చిన కథనాన్ని అమెరికా ఎంబసీ ఖండించింది.

దీని ప్రకారం భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తన బృందంతో మాట్లాడుతూ భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత దిగజారవచ్చునని వ్యాఖ్యానించినట్లుగా పేర్కొంది. కొంతకాలం వరకు భారత అధికారులతో అమెరికా తన సంబంధాలను తగ్గించుకోవాల్సి రావొచ్చునని కూడా ఎరిక్ గార్సెట్టీ పేర్కొన్నారని వార్తలు వచ్చాయి.

దీనిపై భారత్‌లోని అమెరికా ఎంబసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నివేదికలను అమెరికా ఎంబసీ కొట్టి పారేసింది. ఎరిక్ గార్సెట్టీ నిత్యం అమెరికా, భారత ప్రజలు, ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంది. భారత్‌తో అమెరికాకు ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు వెళ్లేందుకు గార్సెట్టీతో పాటు, యూఎస్ మిషన్ ప్రతిరోజు పని చేస్తోందన్నారు.

More Telugu News