Cricket World Cup: ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే వరల్డ్ కప్ ప్రారంభం.. నేటి మధ్యాహ్నమే తొలి మ్యాచ్

  • అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ మ్యాచ్
  • మధ్యాహ్నం 2 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభం
  • కెప్టెన్స్ డే పేరుతో ఈవెంట్ నిర్వహించిన బీసీసీఐ
Cricket World Cup Begins Today But There is No Opening Ceremony

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. మరికాసేపట్లో వన్డే వరల్డ్ కప్ మొదలు కానుంది. గతేడాది ఛాంపియన్ ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కు గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. అయితే, వరల్డ్ కప్ ప్రారంభానికి చిహ్నంగా తొలి మ్యాచ్ కు ముందు ఎలాంటి ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించడంలేదని సమాచారం. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం (ఈ రోజు) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు నిర్వహించాల్సిన ఓపెనింగ్ సెర్మనీని బీసీసీఐ స్కిప్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా కెప్టెన్స్ డే పేరుతో ఓ ఈవెంట్ జరిపింది.

ఇందులో అన్ని జట్ల కెప్టెన్లతో ముఖాముఖి తరహాలో కార్యక్రమం నిర్వహించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది. కాగా, గడిచిన మూడు టోర్నీలలో ఆతిథ్య దేశమే ప్రపంచకప్ ను సొంతం చేసుకుందని, ఈసారి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుందని భావిస్తున్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఆ విషయంపై ఎక్కువగా ఆలోచించడంలేదని చెప్పారు. అయితే, ఈ టోర్నీలో కప్పు గెలుచుకోవడానికి తమ జట్టు శక్తిసామర్థ్యాలన్నీ ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు.

More Telugu News