Hyderabad: రెండు రోజుల క్రితం ప్రియుడి ఆత్మహత్య.. విషయం తెలిసి ఉరేసుకున్న పంజాబ్ ప్రియురాలు

  • హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన 
  • బేకరీలో సేల్స్‌గాళ్‌గా పనిచేస్తున్న యువతి
  • అక్కడే ఆరు నెలల క్రితం పరిచయమైన యువకుడు
Young girl committed suicide two days after her boy friend death

ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. పంజాబ్‌కు చెందిన నేహ (19) 8 నెలలుగా గోపన్‌పల్లి జర్నలిస్టు కాలనీలోని హాస్టల్‌లో ఉంటోంది. నానక్‌రామ్‌గూడలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్లోని బేకరీలో సేల్స్‌గాళ్‌గా పనిచేస్తోంది. బాలాపూర్ పరిధిలోని వెంకటాపురానికి చెందిన సల్మాన్ ఆరు నెలల క్రితం అదే బేకరీలో చేరాడు. వారి మధ్య కుదిరిన స్నేహం ప్రేమగా మారింది. 

వీరిద్దరి మధ్య కొనసాగుతున్న ప్రేమ వ్యవహారం తెలియడంతో బేకరీ నిర్వాహకులు సల్మాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. మరోవైపు, తమ ప్రేమ వ్యవహారాన్ని సల్మాన్ తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లి నేహను పెళ్లాడతానని చెప్పాడు. అందుకు వారు నిరాకరించారు. మనస్తాపానికి గురైన సల్మాన్ ఈ నెల 1న ఆత్మహత్య చేసుకున్నాడు. 

రెండురోజుల తర్వాత విషయం తెలియడంతో నేహ నిన్న తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం నేహ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రియుడి ఆత్మహత్యను తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News