ఫైబర్గ్రిడ్ కేసులో లోకేశ్ ఇప్పటి వరకు నిందితుడు కాదు.. కోర్టుకు తెలిపిన సీఐడీ
- ఈ కేసులో ఆయన ఇప్పటి వరకు నిందితుల జాబితాలో లేరన్న ఏజీ శ్రీరామ్
- 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు తెలిపిన ఏజీ
- ఏజీ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేసిన లోకేశ్ తరపు న్యాయవాది
- 41ఏ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన హైకోర్టు
విచారణలో లోకేశ్ తరపు న్యాయవాది గురుకృష్ణకుమార్ తన వాదనలు వినిపిస్తూ 41ఏ పేరుతో లోకేశ్ను పిలిచి నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అరెస్టు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. 41ఏ(3)(4) నిబంధనలను ఒకేసారి సూచిస్తూ నోటీసు ఇస్తున్నారని, ఆ తర్వాత అందులోని నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వాదించారు.
2021లో నమోదైన ఫైబర్గ్రిడ్ కేసులో ఇప్పటివరకు 94 మంది సాక్షులను సీఐడీ విచారించిందని, వారిలో ఒక్కరు కూడా పిటిషనర్ పేరు చెప్పలేదని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయ కారణాలతో లోకేశ్ పేరును లాగుతున్నారని వివరించారు. కాబట్టి లోకేశ్ అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలను నివారించాలని హైకోర్టును కోరారు. స్పందించిన ఏజీ శ్రీరామ్ 41ఏకు కట్టుబడి ఉంటామని కోర్టుకు తెలపడంతో ఈ వ్యాజ్యాన్ని కోర్టు మూసివేసింది.