yashasvi jaiswal: శుభ్ మన్ గిల్ పేరిట ఉన్న రికార్డును చెరిపేసిన యశస్వి

  • భారత్ తరఫున పిన్న వయస్సులో సెంచరీ నమోదు  
  • 21 ఏళ్ల 279 రోజులకే ట్వంటీ20 సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డ్
  • నేపాల్‌పై 48 బంతుల్లో శతకం బాధిన జైస్వాల్
Yashasvi Jaiswal scores a century becoming the nations youngest player to do so in T20i

భారత్ తరఫున పిన్న వయస్సులో సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకు శుభ్‌మన్ గిల్ పేరిట ఉన్న ఈ రికార్డును యశస్వి చెరిపేశాడు. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ విభాగంలో టీమిండియా క్వార్టర్ మ్యాచ్‌లో నేపాల్‌తో ఆడి విజయం సాధించి, సెమీస్ చేరుకుంది. సెంచరీతో యశస్వి కీలక పాత్ర పోషించాడు. 48 బంతుల్లో శతకం పూర్తి చేశాడు. దీంతో తన తొలి అంతర్జాతీయ ట్వంటీ20 సెంచరీని నమోదు చేశాడు. ఇదే సమయంలో గిల్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.

న్యూజిలాండ్ పై ఈ ఏడాది జనవరిలో శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. అప్పుడు అతని వయస్సు 23 సంవత్సరాల 146 రోజులు. ఇప్పుడు యశస్వి 21 ఏళ్ల 279 రోజుల వయస్సులో నేపాల్ పై సెంచరీ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున ట్వంటీ20ల్లో సెంచరీ సాధించిన ఎనిమిదో క్రికెటర్ యశస్వి. వేగవంతమైన సెంచరీ సాధించిన నాలుగో బ్యాటర్. యశస్వి 48 బంతుల్లో సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 35 బంతుల్లోనే శతకం నమోదు చేశాడు.

More Telugu News