Y Satya Kumar: ఏ పార్టీతో పొత్తు ఉందో పవన్ కల్యాణే స్పష్టత ఇవ్వాలి: బీజేపీ నేత సత్యకుమార్

  • విజయవాడ వచ్చిన సత్యకుమార్
  • పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనే అనేది పవనే చెప్పాలని స్పష్టీకరణ
  • ఏపీలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోందని వెల్లడి
  • ఎన్నికల నాటికి పొత్తుపై పార్టీ హైకమాండే నిర్ణయిస్తుందని వ్యాఖ్యలు
BJP National Secretary Y Satya Kumar talks about alliance

బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన-టీడీపీ భాగస్వామ్యం అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పదే పదే ప్రస్తావిస్తుండడం పట్ల ఆయన స్పందించారు. ఏపీలో ఏ పార్టీతో పొత్తు ఉందో పవన్ కల్యాణ్ స్పష్టత ఇవ్వాలని సత్యకుమార్ పేర్కొన్నారు. పొత్తు బీజేపీతోనో, టీడీపీతోనో అనేది పవనే చెప్పాలని స్పష్టం చేశారు. 

విజయవాడలోని ఖాదీ గ్రామోద్యోగ్ ఎంపోరియాన్ని ఆయన ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. 

"ఏపీలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ఇతర పార్టీల వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో బీజేపీ కార్యకర్తగా నేనెలా చెప్పగలను? రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉంటుందా, లేదా అనేది అప్పటి పరిస్థితులను బట్టి పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఇప్పటివరకైతే ఏపీ బీజేపీ దృష్టి అంతా అరాచక పాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడంపైనే ఉంది" అని సత్యకుమార్ వివరించారు.

More Telugu News