Janasena: పవన్ కల్యాణ్‌పై నిరాధార ఆరోపణలు చేశారంటూ పోసాని కృష్ణమురళిపై జనసైనికుల కేసు

  • రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన జనసేన
  • పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టుకు వెళ్లిన జనసేన
  • కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు
Rajamundry police files case against posani

ప్రముఖ సినీ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళిపై రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన నాయకులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదయింది. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై పోసాని అనుచిత వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేశారంటూ స్థానిక జనసేన నాయకులు గతంలో రాజమండ్రి టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో జనసేన నాయకులు కోర్టును ఆశ్రయించారు.

తాము ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయడం లేదని న్యాయస్థానానికి తెలిపారు. జనసేన నాయకుల పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం... పోసానిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందని తెలుస్తోంది. దీంతో ఐపీసీ 354, 355, 500, 504, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

More Telugu News