actor vishal: విశాల్ లంచం ఆరోపణలపై స్పందించిన కేంద్రం, సీరియస్‌‌గా తీసుకున్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ

  • మార్క్ ఆంటోని సినిమా హిందీ వర్షన్ సెన్సార్ కోసం రూ.6.5 లక్షలు ఇచ్చానన్న విశాల్
  • సెన్సార్ బోర్డుపై అవినీతి ఆరోపణలు బాధాకరమన్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ 
  • ఈ రోజే విచారణ జరపనున్న సీనియర్ అధికారి
Centre On Actor vishal Censor Board Corruption Charge

సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. విశాల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ రోజు విచారణ జరపనున్నట్లు తెలిపింది. సెన్సార్ బోర్డ్‌లో అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు రావడం బాధాకరమని, అవినీతి జరిగితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని స్పష్టం చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు ఉంటాయని పేర్కొంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి విశాల్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ రోజు విచారణ జరపనున్నారని తెలిపారు.

మార్క్ ఆంటోనీ సినిమా హిందీ వర్షన్ సెన్సార్ విషయమై తాను రూ.6.5 లక్షలు లంచం ఇవ్వవలసి వచ్చిందని నటుడు విశాల్ గురువారం ట్వీట్ చేశారు. స్క్రీనింగ్ కోసం రూ.3.5 లక్షలు, సర్టిఫికెట్ కోసం రూ.3 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. మరోదారి లేక తాను డబ్బులు ఇవ్వవలసి వచ్చిందని, తాను ఈ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఎవరెవరికి డబ్బులు పంపించారో ఆ వివరాలను కూడా వెల్లడిస్తూ ప్రధాని మోదీ, మహా సీఎం షిండేలను ట్యాగ్ చేశారు. దీనిని కేంద్ర సమాచార శాఖ సీరియస్‌గా తీసుకున్నది.

More Telugu News