Ahmedabad: సిబ్బందిని మందలించిందని మహిళను చితకబాదిన వ్యాపార భాగస్వామి

  • గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో దారుణం
  • దాడికి సంబంధించిన వీడియో వైరల్
  • విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో నిందితుడిపై కేసు నమోదు
Ahmadabad man hits female business after she raps another female employee

ఓ మహిళపై ఆమె వ్యాపారభాగస్వామి బహిరంగంగా దాడి చేసిన ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో తాజాగా చోటుచేసుకుంది. సిబ్బందిలో ఒకరిని మహిళ మందలించడంతో ఆమెపై నిందితుడు దాడికి తెగబడ్డాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే, మొహిసీన్ అనే వ్యక్తితో కలిసి బాధితురాలు నగరంలో ఓ సెలూన్ ప్రారంభించింది. అయితే, ఇటీవల రూ.5 వేలు నష్టం రావడంతో ఆమె సెలూన్‌లో పనిచేసే మరో మహిళను మందలించింది. దీంతో, మొహిసీన్ బాధితురాలిపై రెచ్చిపోయాడు. సిబ్బందిని ఎందుకు తిట్టావంటూ ఆమెతో గొడవకు దిగాడు. 

ఈ క్రమంలో బాధితురాలు షాపులోంచి బయటకు వచ్చేయగా ఆమె వెంటే బయటకు వచ్చిన మొహిసీన్ మహిళపై అందరి ముందు చేయిచేసుకున్నాడు. జుట్టు పట్టి లాగుతూ పలుమార్లు చెంప ఛెళ్లుమనిపించాడు. దారినపోయేవారు అతడిని ఆపే ప్రయత్నం చేసినా మొహిసీన్ వెనక్కు తగ్గలేదు. సీసీటీవీ కెమెరాలో చిక్కిన ఈ దృశ్యాలు సోషల్ మీడియా బాట పట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలిని సంప్రదించి ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగిక వేధింపులు, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, తాను పోలీసులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా మొహిసీన్ తన ఫోన్ లాగేసుకున్నాడని ఆమె తెలిపింది. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన మీడియాకు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపింది.

More Telugu News