Pawan Kalyan: అత్యాచారాలు, హత్యలపై ఎందుకు స్పందించడం లేదు?: ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ మండిపాటు

  • ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా? అని నిలదీత
  • విద్యార్థి దారుణ హత్యకు గురైతే ఎవరూ స్పందించలేదని వ్యాఖ్య
  • పోలీసులు కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణ  
Pawan kalyan questions jagan government and women commission

ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డల అదృశ్యం గురించి మాట్లాడగానే హాహాకారాలు చేసిన పాలకపక్షం, మహిళా కమిషన్ రాష్ట్రంలో నమోదవుతున్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు మౌనంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 'ఆడబిడ్డలపై సాగుతున్న దురాగతాల గురించి స్పందించాల్సిన బాధ్యత లేదా?' అంటూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో జరుగుతోన్న అత్యాచారాలు, హత్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైతే ముఖ్యమంత్రి లేదా హోం శాఖ లేదా మహిళా కమిషన్ స్పందించలేదని మండిపడ్డారు. 

అనుమానాస్పద మృతి అంటూ పోలీసులు ఈ కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. బాలిక తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. విజయనగరం జిల్లా లోతుగెడ్డలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలిచివేసిందన్నారు. మైనర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారంటే రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ, శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థమవుతోందన్నారు.

ఏపీలో అడబిడ్డలకు రక్షణ కరవైందన్నది వాస్తవమని, మహిళలను వేధించే వారిపై కఠినంగా వ్యవహరించడం లేదని, పోలీసుల చేతులు కట్టేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టాలు చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్న పాలకులు కేవలం ప్రకటనలకు పరిమితమయ్యారు తప్ప రక్షణ మాత్రం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి మహిళల రక్షణపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలన్నారు.

More Telugu News