Nara Bhuvaneswari: నేను కూడా ఒక స్త్రీనే... ఈ ఘటనలను నేను మర్చిపోను: నారా భువనేశ్వరి

  • చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు
  • తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన నారా భువనేశ్వరి
  • సీతానగరంలో దీక్షా శిబిరం సందర్శన
  • చంద్రబాబు ఏమైనా ప్రజల సొమ్ము దోచుకున్నారా అంటూ ప్రశ్నించిన వైనం 
  • ఆయనను జైల్లో వేస్తే ఏమొస్తుందో వారికే తెలియాలంటూ వ్యాఖ్యలు
Nara Bhuvaneswari speech in Sithanagaram

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు దీక్షలు కొనసాగిస్తున్నాయి. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో చేపట్టిన నిరసన దీక్షలో చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె పరిస్థితుల పట్ల తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రూ.371 కోట్లు దారి మళ్లించారని చెప్తున్నారని, కానీ అ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్లాయో నిరూపించడం లేదన్నారు. ఏ కేసులో అయినా ఆధారం చూపి అరెస్టు చేస్తారని... కానీ స్కిల్ కేసులో ఆధారాలు లేకుండా అరెస్టు చేసి... ఇప్పుడు డబ్బులు ఎక్కడి వెళ్లాయని విచారిస్తున్నారని అన్నారు. ఇలాంటి విచిత్రాన్ని ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరన్నారు. 

‘‘చంద్రబాబు ప్రజల సొమ్మేమీ దోచుకోలేదు. అయినా జైల్లో నిర్బంధించారు. ఆయన కోసం మీరందరూ పోరాటానికి వచ్చారు. ప్రజల మనిషిని జైల్లో వేసి 19 రోజులైంది... ఏం తప్పు చేశారో ఒక్కటన్నా నిరూపించారా? చంద్రబాబు వేసిన ప్రశ్నలకు సీఐడీనే సమాధానం చెప్పలేకపోయింది. 

45 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుపై ఎన్నో కేసులు పెట్టారు, ఏ ఒక్కటైనా నిరూపించగలిగారా? సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండి ప్రజల కోసమే చంద్రబాబు పనిచేశారు. ఆయన ఊపిరి, ఆలోచనలో ఉంది ప్రజలే. ప్రజలకు ఏం చేస్తే  మంచి జరుగుతుందో, రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలి అని నిత్యం ఆలోచిస్తారు. 

యువతకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రానికి ఏ పరిశ్రమ తీసుకొద్దామా అని ఆలోచిస్తారు. స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ద్వారా ఉద్యోగాలు పొంది లక్షల్లో జీతాలు తీసుకుంటూ కొందరు సీఈఓ స్థాయికి ఎదిగారు. పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లోనూ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 

ప్రజలు... ప్రజలు అని అంటూ ఆయన కుటుంబాన్ని కూడా పట్టించుకోరు. ప్రజల గురించే ఆయన ఆలోచిస్తుంటారు. బీఏ చదివిన నాకు హెరిటేజ్ కంపెనీ అప్పగించారు. 3 నెలల్లోనే పరిశ్రమను నడిపించే స్థాయికి వెళ్లాను. 

సీఎంగా ఉన్న సమయంలో పలుసార్లు చంద్రబాబుతో ప్రోటోకాల్ కార్యక్రమాలకు వెళ్లేదాన్ని. రోడ్లపై చిన్నపాటి గుంతలు ఉన్నా వెంటనే అక్కడి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేవారు. తాను వెళుతున్న దారిలో వీధి లైట్లు సరిగా లేకపోయినా అధికారులకు అప్పటికప్పుడు ఫోన్ చేసి ప్రశ్నించేవారు. వీధి లైట్లు వెలుగుతున్నాయా లేదా అని యాప్ ద్వారా రోజూ పరిశీలించేవారు. ఎక్కడ బల్బు వెలగకపోయినా ఎందుకు వెలగడంలేదని అధికారులను నిలదీసేవారు. అంత బాధ్యతగా ఉండే మనిషిని జైల్లో పెడితే ఏం సంతోషం వస్తుందో వారికే తెలియాలి. 

టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు బిడ్డల్లాంటి వాళ్లు. కుటుంబ పెద్దను హింసించి జైల్లో పెడితే బిడ్డలు ఊరుకుంటారా? నిరసనలు తెలిపితే హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా జరిగే నిరసనలపై పోలీసులు దాడులు చేస్తూ మహిళలను కూడా వ్యానుల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదా? 

నేను కూడా ఒక స్త్రీనే... ఈ ఘటనలు నేను మర్చిపోను. నాపైనా రకరకాల మాటలతో దాడి చేశారు. అయినా భయపడలేదు. పనిలేని వాళ్లు ఏమైనా అంటారు. అలాంటివి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సృష్టికి ఆడదే మూలమన్న విషయం వారు మర్చిపోతున్నారు. 

అన్ని వర్గాల వారు వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. మీ పోరాటానన్ని మేము మర్చిపోలేము. యువత భవిష్యత్తు కోసం యువగళంను లోకేశ్ ప్రారంభించారు. లోకేశ్ ను మాట్లాడనివ్వకుండా ఈ ప్రభుత్వం మైక్ లు, సౌండ్ వాహనాలు, నిలబడేందుకు తెచ్చుకున్న కుర్చీ కూడా ఎత్తుకెళ్లింది. ఎన్ని అడ్డుంకులు సృష్టించినా యువగళం పాదయాత్ర ఆగదు. చేయీ, చేయీ కలిపి చంద్రబాబుకు మద్ధతుగా ఉందాం. 

మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి 70 ఏళ్లు..అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉంటే ఆమెపై హత్యాయత్నం కేసు పెట్టారు. ఈ కేసులో ఏమైనా అర్థం ఉందా? ఆమె హత్య చేస్తారా? కుప్పంలో కూడా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 

పోలీసులకు వారి విధులు తెలియవా...? ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తున్నారు. రాష్ట్రం, మీ జీవితాల గురించి, భవిష్యత్ గురించి ఆలోచించండి. భయపడకుండా అందరూ ముందుకొచ్చి ఓటేయాలి..ధైర్యంతో మీరంతా ముందుకు సాగితే ప్రభుత్వం ఏమీ చేయలేదు. సేవ్ ఆంధ్రప్రదేశ్... సేవ్ డెమొక్రసీ.. సత్యమేవ జయతే’’ అని భువనేశ్వరి నినదించారు.

More Telugu News