G. Kishan Reddy: నాకు కేటీఆర్ సర్టిఫికెట్ అవసరంలేదు: కిషన్ రెడ్డి

  • తనకు తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ చాలని వ్యాఖ్య
  • అక్టోబర్ మొదటి వారంలో ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారని వెల్లడి
  • మోదీ తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎవరని ప్రశ్న
Kishan Reddy counter to KTR for his comments

తనకు మంత్రి కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ అవసరమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఉదయం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కిషన్ రెడ్డి అసమర్థుడు, మోస్ట్ అన్ ఫిట్ లీడర్ అని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. అక్టోబర్ 3న నిజామాబాద్ పట్టణంలోని జీజీ గ్రౌండ్‌లో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తెలంగాణలో మోదీ రెండు రోజుల పాటు పర్యటిస్తారన్నారు. అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో జరిగే బహిరంగ సభలో, 3న నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.

పాలమూరు సభలో పలు అభివృద్ధి పనులకు, ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. ఇందూరులో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూ.6వేల కోట్ల విలువైన ఎన్టీపీసీ పవర్ ప్లాంటును మోదీ వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. హైదరాబాద్ నుంచి మొదలు అదిలాబాద్ వరకు బీజేపీ బలోపేతమైందన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయని, గిరిజనులతో పాటు స్థానిక ప్రజలు బీజేపీని ఆదరించి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. బీజేపీపై విమర్శలు చేసే నైతిక హక్కు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. మోదీ తెలంగాణ పర్యటన గురించి ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎవరు? అని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు ఏర్పాటుపై చర్చించి నిర్ణయిస్తామన్నారు.

More Telugu News