Janmabhumi Express: జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు... తీవ్ర భయాందోళనలకు గురైన ప్రయాణికులు

  • లింగంపల్లి నుంచి విశాఖ వెళుతున్న జన్మభూమి ఎక్స్ ప్రెస్
  • ఏలూరు వద్ద ఓ జనరల్ బోగీలో పొగలు
  • మరమ్మతుల అనంతరం తిరిగి బయల్దేరిన రైలు
  • తాడేపల్లిగూడెం స్టేషన్ వద్ద మరో రెండు బోగీల్లో పొగలు
Smoke in Janmabhumi express

లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలులో నేడు పొగలు వచ్చాయి. మూడు కంపార్ట్ మెంట్లలో పొగలు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. మొదట ఓ జనరల్ బోగీలో పొగలు రావడాన్ని ఏలూరు వద్ద గుర్తించారు. అధికారులు స్పందించి సంబంధిత మరమ్మతులు చేయడంతో పొగ రావడం ఆగిపోయింది. దాంతో, అరగంట అనంతరం రైలు ఏలూరు నుంచి బయల్దేరింది. 

అయితే తాడేపల్లిగూడెం వద్దకు చేరుకోగానే, మరో రెండు బోగీల్లో పొగ రావడం ప్రారంభమైంది. అధికారులకు సమాచారం అందించగా... జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను తాడేపల్లిగూడెం స్టేషన్ వద్ద నిలిపివేశారు. 

రైలు ఆగడంతో, పొగలు వచ్చిన బోగీల్లోని ప్రయాణికులు ఒక్కసారిగా కిందికి దూకి పరుగులు తీశారు. సిబ్బంది కాసేపు శ్రమించి పొగ రాకుండా కట్టడి చేశారు. బ్రేకులు పట్టేయడం వల్లనే పొగలు వచ్చాయని వారు తెలిపారు. కాగా, బోగీల్లో పొగలు రావడంతో అగ్నిప్రమాదం జరుగుతుందేమోనని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

More Telugu News