Sathya Kumar: చార్లెస్ శోభరాజ్ మాదిరి జగన్ తప్పించుకు తిరుగుతున్నారు.. బైజూస్ అవినీతిని బయటకు తీస్తాం: బీజేపీ నేత సత్యకుమార్

  • చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు సరికాదన్న సత్యకుమార్
  • పదేళ్లుగా జగన్ బెయిల్ పై బయట తిరుగుతున్నారని విమర్శ
  • చంద్రబాబు బెయిల్ అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని.వ్యాఖ్య   
Satya Kumar fires on Jagan

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు సరికాదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. చంద్రబాబు బెయిల్ అంశం అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని... కోర్టు పరిధిలోని అంశమని చెప్పారు. ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని అన్నారు. 


అంతర్జాతీయ నేరస్తుడు చార్లెస్ శోభరాజుతో ముఖ్యమంత్రి జగన్ ను సత్యకుమార్ పోల్చారు. నేరస్తుడైన శోభరాజ్ ఏళ్లపాటు చిక్కకుండా తప్పించుకు తిరిగారని.... ఇప్పుడు జగన్ పదేళ్లుగా బెయిల్ పై తిరుగుతున్నారని విమర్శించారు. బైజూస్ లో వైసీపీ అవినీతిపై బీజేపీ ఆధారాలను సేకరిస్తోందని... త్వరలోనే కేసులు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 రోజులుగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెకిలి మాటలు, వికృత చేష్టలతో ప్రజల దృష్టిని మరల్చుతున్నారని విమర్శించారు. 

జగన్ కేవలం కక్ష సాధింపులపైనే దృష్టి సారిస్తున్నారని... రైతులు, రైతాంగ సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు. ఏడు సార్లు కరెంట్ ఛార్జీలను పెంచారని, కరెంట్ కోతలు పెరిగిపోయాయని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేయడంతో పరిస్థితులు అగమ్యగోచంగా మారాయని అన్నారు. ఉత్తుత్తి బటన్లు నొక్కుతూ ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.  

ఏపీ పోలీసులపై వైసీపీ ప్రభుత్వ ఒత్తిడి ఎక్కువయిందని సత్యకుమార్ విమర్శించారు. ప్రభుత్వ ఒత్తిడిని తట్టుకోలేక ప్రతిరోజు పోలీసులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని కూడా చూడకుండా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఎన్నికల్లో పొత్తులపై జనవరిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

More Telugu News