Chandrayaan-3: ల్యాండర్, రోవర్ నుంచి అందని సిగ్నల్స్‌.. మరిన్ని రోజులు వేచి చూస్తామన్న ఇస్రో

  • చంద్రుడిపై పొద్దుపొడిచి మూడు రోజులు కావస్తున్నా ల్యాండర్, రోవర్ నుంచి రాని సిగ్నల్స్
  • అక్కడ వెలుతురు ఉన్నంత వరకూ అవి ఎప్పుడైనా మేల్కోవచ్చన్న ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్
  • తదుపరి ఏం జరుగుతుందో చెప్పడం కష్టమని వ్యాఖ్య
ISRO chief says they will continue to wait for the chandrayaan 3 signal

చంద్రుడిపై పొద్దుపొడిచి మూడు రోజులు దాటినా చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ నుంచి ఎటువంటి సంకేతాలు రాలేదు. అయితే, సూర్యరశ్మి ల్యాండర్, రోవర్‌పై ఉన్నంతకాలం అవి ఎప్పుడైనా మళ్లీ క్రియాశీలకం కావచ్చని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ తెలిపారు. 

‘‘ఇప్పటివరకూ ఎటువంటి సిగ్నల్ రాలేదు. అలా అని సిగ్నల్ ఇక ఎప్పటికీ రాదని కూడా చెప్పలేం. మరో 14 రోజుల పాటు వేచి చూద్దాం. ఈ సమయంలో ల్యాండర్, రోవర్‌పై సూర్యరశ్మి పడుతూనే ఉంటుంది. కాబట్టి, వాటి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉంది. అంటే చివరి రోజున కూడా అవి క్రియాశీలకం కావచ్చు. తదుపరి ఏం జరుగుందో చెప్పడం అసాధ్యం’’ అని ఆయన పేర్కొన్నారు.

చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్ మరోసారి క్రియాశీలకం అయితే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ తెలిపారు. మునుపు జరిపిన పరీక్షలను మరో ప్రాంతంలో నిర్వహించి చంద్రుడి గురించి మరింత కచ్చితమైన సమాచారం సేకరించవచ్చని అన్నారు. అయితే, ల్యాండర్, రోవర్ మళ్లీ మేల్కొంటాయా? లేదా? అన్న విషయం అటుంచితే చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపై సురక్షితంగా ల్యాండర్ దిగడం, చంద్రుడి ఉపరితలంపై రోవర్ కలియతిరుగుతూ ప్రయోగాలు చేపట్టడం వంటి లక్ష్యాలను విజయవంతంగా చేరామని ఇస్రో పేర్కొంది.

More Telugu News