Vande Bharat Trains: రేపు మరో 9 వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

  • దేశంలో మరింత పెరగనున్న వందేభారత్ రైళ్ల సంఖ్య
  • కొత్త రైళ్లకు వర్చువల్ గా పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ 
  • ఏపీ, తెలంగాణలకు రెండు వందేభారత్ రైళ్లు
PM Modi will inaugurate 9 Vande Bharat trains tomorrow

దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య మరింత పెరగనుంది. రేపు (సెప్టెంబరు 24) ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా 9 వందేభారత్ రైళ్లకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కొత్త వందేభారత్ రైళ్ల ద్వారా తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, కేరళ, గుజరాత్, ఒడిశా, బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల ప్రయాణికులకు లబ్ది చేకూరనుంది.

ఈ 9 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లకు ప్రధాని మోదీ వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభోత్సవం చేయనున్నారు. దేశంలో అత్యంత వేగంగా వెళ్లే రైళ్లుగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు పేరుగాంచాయి. సాధారణ రైళ్లతో పోల్చితే వీటిలో ప్రయాణిస్తే సగటున రెండున్నర గంటల సమయం ఆదా అవుతుంది. 

రేపు ప్రారంభోత్సవం జరుపుకునే కొత్త వందేభారత్ రైళ్లలో హైదరాబాద్-బెంగళూరు, విజయవాడ-చెన్నై సర్వీసులు కూడా ఉన్నాయి. విజయవాడ-చెన్నై వందేభారత్ రైలును తిరుపతికి తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని రేణిగుంట మీదుగా నడపనున్నారు.


రేపు ప్రధాని మోదీ ప్రారంభించే వందేభారత్ రైళ్లు ఇవే...

1. హైదరాబాద్-బెంగళూరు
2. విజయవాడ-చెన్నై
3. ఉదయ్ పూర్-జైపూర్
4. తిరునల్వేలి-మధురై-చెన్నై
5. పాట్నా-హౌరా
6. కాసరగోడ్-తిరువనంతపురం
7. రూర్కేలా-భువనేశ్వర్
8. పూరీ-రాంచీ-హౌరా
9. జామ్ నగర్-అహ్మదాబాద్

More Telugu News