Team India: తొలి వన్డేలో టీమిండియాదే విజయం

  • మొహాలీలో తొలి వన్డే
  • 5 వికెట్ల తేడాతో ఆసీస్ ను ఓడించిన భారత్
  • 277 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో ఛేదించిన వైనం
  • అదిరిపోయే ఆరంభం అందించిన గిల్, గైక్వాడ్
  • అర్ధసెంచరీలతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్, సూర్య
Team India beat Aussies by 5 wickets

సొంతగడ్డపై టీమిండియా ఆధిపత్యం మరోసారి రుజువైంది. ఆస్ట్రేలియా జట్టుతో మొహాలీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యాన్ని 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఓపెనర్లు పటిష్టమైన పునాది వేయగా, మధ్యలో కొన్ని కుదుపులకు లోనైనప్పటికీ, కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ నాణ్యమైన ఇన్నింగ్స్ లతో టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. చివర్లో సూర్య అవుటైనప్పటికీ, కేఎల్ రాహుల్ ఓ ఫోర్, సిక్స్ తో మ్యాచ్ ను ముగించాడు. 

టీమిండియా ఇన్నింగ్స్ లో ఓపెనర్లు శుభ్ మాన్ గిల్ (74), రుతురాజ్ గైక్వాడ్ (71) తొలి వికెట్ కు 142 పరుగులు జోడించి ఛేజింగ్ లో శుభారంభం అందించారు. శ్రేయాస్ అయ్యర్ (3) విఫలం కాగా, ఇషాన్ కిషన్ 18 పరుగులు చేశాడు. 

అయితే, ఆరంభంలో అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న కేఎల్ రాహుల్ 63 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 58 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 50 పరుగులు చేసి అవుటయ్యాడు. 

ఆసీస్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 1, షాన్ అబ్బాట్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 24న ఇందోర్ లో జరగనుంది.

More Telugu News