Garuda Seva: నేడు గరుడ సేవ... గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుమల

  • తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • నేటి రాత్రి 7 గంటల నుంచి స్వామివారికి గరుడ సేవ
  • శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగుతున్న మలయప్పస్వామి
  • లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు  
Garuda Seva for Lord Venkateswara today

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటలకు గరుడ సేవ ప్రారంభమైంది. గరుడ సేవ విశిష్టత దృష్ట్యా లక్షలాది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. దాంతో తిరుమల కొండపై ఈ ఉదయం నుంచే విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది. 

గరుడుని రెక్కలను జ్ఞాన, వైరాగ్యాలకు ప్రతిరూపాలని చెబుతారు. గరుడుని అధిష్టించిన స్వామివారిని దర్శిస్తే సర్వ పాపహరణం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాశస్త్యం ఉంటుంది. 

కాగా, ఇవాళ్టి గరుడ సేవను పురస్కరించుకుని గ్యాలరీల్లోనే రెండు లక్షల మంది భక్తులు ఉండగా, వెలుపల కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. దాంతో తిరుమాడ వీధులు కిటకిటలాడుతున్నాయి. గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు ఊరేగుతుండగా, భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల కొండ మార్మోగిపోతోంది.

More Telugu News