Daggubati Purandeswari: మద్యం దుకాణంలో బిల్లు అక్రమాలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పురందేశ్వరి!

  • మద్యం దుకాణాల ముట్టడి, నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ మహిళా మోర్చా
  • రూ.1 లక్ష విలువైన సరుకును అమ్మి, రూ.700కు మాత్రమే బిల్లులు ఇచ్చారని ఆరోపణ
  • వైసీపీ నేతలు మద్యం ద్వారా డబ్బులు దండుకుంటున్నారని విమర్శ
Purandeswari Exposes Bill less Sales at a Liquor Shop

మద్యం దుకాణాల్లో అక్రమాలను బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా అధ్వర్యంలో మద్యం దుకాణాల ముట్టడి, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురంలోని ఓ మద్యం దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఒకరోజులో ఇక్కడ రూ.1 లక్ష విలువైన సరుకును విక్రయిస్తే బిల్లు రూ.700కు మాత్రమే ఇచ్చినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి మద్యం దుకాణంలో ఉన్న వ్యక్తి నుంచి ఈరోజు వచ్చింది ఎంత? బిల్లులు ఇచ్చింది ఎంత? అని ఆరా తీశారు. అనంతరం మద్యం సీసాలతో నిరసన తెలిపి, వాటిని ధ్వంసం చేశారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజు లక్ష రూపాయల విలువైన సరుకులు అమ్మితే బిల్లు ఇచ్చింది మాత్రం రూ.700 మాత్రమే అన్నారు. తాను కొన్ని రోజులుగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇదే విషయం చెబుతున్నానని, ఇప్పుడు తాను చెప్పినదానికి ఇది సజీవ సాక్ష్యమన్నారు. మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. నాసిరకం మద్యం విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో వైసీపీ ఆడుకుంటోందన్నారు. దశలవారీగా మద్యనిషేధం అమలు చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. మద్యం బాండ్లను తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో అప్పులు తెచ్చిందన్నారు. 

More Telugu News