India: కెనడాలో 20 ఏళ్లలో రెండింతలు పెరిగిన సిక్కులు: భారత్-కెనడా వ్యాపార, విద్యా సంబంధాల లెక్కలివే...!

  • 3.7 కోట్ల కెనడా జనాభాలో భారతీయులు 14 లక్షలమంది
  • ఇందులో సగానికి పైగా సిక్కు జాతీయులు
  • 2022లో ద్వైపాక్షిక వాణిజ్య విలువ 9 బిలియన్ అమెరికన్ డాలర్లు
  • భారత స్టాక్ మార్కెట్లలో కెనడియన్ల కోట్లాది రూపాయల పెట్టుబడులు
India Canada trade and education relations

ఖలిస్థాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆ దేశం వ్యవహరించిన తీరుతో భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఖలిస్థాన్ అంశం, ట్రూడో ఆరోపణల నేపథ్యంలో అటు కెనడా, ఇటు భారత్ తమ పౌరులకు సూచనలు జారీ చేసింది. కెనడాలోని భారతీయులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కెనడా వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉన్న వ్యాపార, విద్యా సంబంధాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. భారత్-కెనడా మధ్య ఉన్న వ్యాపార, విద్యా సంబంధాలను చూద్దాం....

జనాభా

కెనడా జనాభా దాదాపు 3.7 కోట్లు. ఇందులో 14 లక్షల మంది భారతీయులు లేదా భారతీయ మూలాలు కలిగినవారు ఉన్నారు. 2021 కెనడా జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ దేశం మొత్తం జనాభాలో భారతీయుల జనాభా 3.7 శాతం. ఇందులోను ఎక్కువమంది అంటే 7,70,000 మంది తమ మతాన్ని సిక్కుగా పేర్కొన్నారు. కెనడా జనాభాలో సిక్కులు 2 శాతంగా ఉన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా 143 కోట్లతో భారత్ ఉంది. భారత్ ఉత్తరాది రాష్ట్రమైన పంజాబ్‌లో సిక్కులు అత్యధికంగా ఉంటారు. భారత జనాభాలో వీరి వాటా 1.7 శాతం. కెనడాలో కెనడియన్స్ జనాభా 15.6 శాతం, ఇంగ్లీష్ 14.7 శాతం, ఐరిష్ 12.1 శాతం, స్కాటిష్ 12.1 శాతం, ప్రెంచ్ 11 శాతం, జర్మన్ 8.1 శాతం, చైనీస్ 4.7 శాతం, ఇటాలియన్ 4.3 శాతం, ఇండియన్ 3.7 శాతం, ఉక్రెయిన్ 3.5 శాతంగా ఉన్నారు.

వ్యాపారం

ప్రభుత్వం ప్రకారం 2022లో భారత్-కెనడా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 9 బిలియన్ డాలర్లుగా (యూఎస్)గా ఉంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ట్రేడ్ వ్యాల్యూ 57 శాతం పెరిగింది. కెనడా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా ఇంధన ఉత్పత్తులైన బొగ్గు, కోక్, బ్రికెట్లు ఉన్నాయి. అదే సమయంలో భారత్ కన్స్యూమర్ గూడ్స్, వస్త్రాలు, ఆటో విడిభాగాలు, విమాన పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

ట్రేడింగ్ ఎకనమిక్స్/యూఎన్ కామ్‌ట్రేడ్ డేటా ప్రకారం 2022లో కెనడా నుంచి భారత్ అత్యధికంగా శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంది. వీటి విలువ దాదాపు 1 బిలియన్ ఆమెరికా డాలర్లు. ఆ తర్వాత 748 మిలియన్ డాలర్ల ఫెర్టిలైజర్ ఉత్పత్తులు, 384 మిలియన్ డాలర్ల కలప గుజ్జు, ప్లాంట్ ఫైబర్ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంది.

2021 డేటా ప్రకారం భారత్ దిగుమతి చేసుకున్న వాటిలో మినరల్ ఉత్పత్తులు 36 శాతం, పేపర్ గూడ్స్ 15 శాతం, వెజిటేబుల్ ఉత్పత్తులు 11 శాతం, మెటల్స్ 10 శాతం, కెమికల్ ఉత్పత్తులు 7 శాతం, ప్రీసియస్ మెటల్స్ 7 శాతం, మిషన్స్ 6 శాతం ఉన్నాయి. అదే సమయంలో కెనడాకు భారత్ ఎగుమతి చేసినవాటిలో కెమికల్ ఉత్పత్తులు 20 శాతం, టెక్స్ టైల్స్ 16 శాతం, మెటల్స్ 14 శాతం, మిషన్స్ 10 శాతం, ప్రిసియస్ మెటల్స్, రవాణా, వెజిటబుల్ ఉత్పత్తులు 6 శాతం చొప్పున, ప్లాస్టిక్ 5 శాతం, ఫుడ్ స్టఫ్ 4 శాతం, జంతు ఉత్పత్తులు 4 శాతం, ఫర్నీచర్ 3 శాతం, ఇతరములు 6 శాతంగా ఉన్నాయి.

భారత 17వ లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్టర్‌గా కెనడా ఉంది. 2000 సంవత్సరం నుంచి 3.6 బిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. భారత స్టాక్ మార్కెట్, డెట్ మార్కెట్‌లలో కెనడియన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేశారు.

విద్య

2018 నుంచి కెనడాలో అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయుల వాటా పెరుగుతోంది. కెనడియన్ బ్యూరో ఫర్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ప్రకారం 2022లో విద్యార్థుల వాటా 47 శాతానికి పెరిగి 3,20,000కు చేరుకుంది. కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో భారత్ వాటా 40 శాతంగా ఉంది. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం సిక్కులు భారత్ నుంచి పెద్ద సంఖ్యలో కెనడాకు వెళ్లారు. దీంతో గత ఇరవై ఏళ్ల కాలంలో కెనడాలో సిక్కులు రెండింతలు పెరిగారు.

More Telugu News