Daggubati Purandeswari: మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దోచుకుంటున్నారు: పురందేశ్వరి

  • పొత్తులపై సమయానుకూలంగా నిర్ణయం ఉంటుందన్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు
  • పవన్ వివరించాక అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టీకరణ
  • చంద్రబాబు అరెస్ట్ తీరును మొదటి నుంచి ఖండిస్తున్నామని వ్యాఖ్య
  • మద్యం ద్వారా వస్తున్న ఆదాయంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
Purandeswari on pawan kalyan alliance statment

టీడీపీ, జనసేన పొత్తుపై ఇటీవల పవన్ కల్యాణ్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మరోసారి పొత్తులపై స్పందించారు. పొత్తులపై సమయాన్ని బట్టి నిర్ణయం ఉంటుందన్నారు. టీడీపీతో పొత్తుపై తమ పార్టీ అధిష్ఠానానికి వివరిస్తానని పవన్ చెప్పారన్నారు. పవన్ వివరణను బట్టి జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తులపై పార్టీ అధిష్ఠానానిదే తుది నిర్ణయమన్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నానని పవన్ చెప్పారని ఆమె గుర్తు చేశారు.

బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు దూరంగా ఉంటుందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరును తాము మొదటి నుంచి ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ కేసులో సీఐడీ పూర్తిస్థాయిలో విచారణ చేసిందా? లేదా? అనే అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో స్కిల్ కార్పోరేషన్ పనితీరును తాము వాకబు చేశామన్నారు. స్కిల్ కేంద్రాలకు పరికరాలు ఇచ్చారన్నారు.

రాష్ట్రంలో మద్యం పేరుతో కుంభకోణం జరుగుతోందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో మద్యం ద్వారా రూ.20వేల కోట్ల ఆదాయం వస్తోందని చెబుతున్నారని, కానీ వాస్తవానికి రూ.56,700 కోట్లు వస్తోందని ఆమె చెప్పారు. మిగిలిన రూ.36,700 కోట్ల సొమ్ము ఎక్కడకు వెళ్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశిస్తే నిజానిజాలు వెలుగు చూస్తాయన్నారు. మద్యం ద్వారా దోచుకున్న తీరుపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. మద్యం ద్వారా వైసీపీ నేతలు డబ్బులు దోచుకుంటున్నారన్నారు.

More Telugu News