COVID19: కరోనాతో బాధపడుతూ.. సహచరుల వద్ద దగ్గిన భారత సంతతి సింగపూర్ వ్యక్తికి జైలు

  • కరోనా నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జైలు
  • 2021లో నమోదైన కేసు
  • తనకు కరోనా సోకిన విషయం తెలిసి కూడా నేరుగా ఆఫీసుకు
  • అక్కడ మాస్క్‌తో రెండుసార్లు, మాస్క్ లేకుండా ఓసారి దగ్గిన నిందితుడు
Covid infected Indian origin Singaporean jailed for coughing

సహచరుల వద్ద మాస్క్ లేకుండా దగ్గిన భారత సంతతికి చెందిన 64 ఏళ్ల సింగపూర్ వ్యక్తికి కోర్టు రెండువారాల జైలు శిక్ష విధించింది. 2021లో కరోనా నిబంధనలను ఉల్లంఘించి ఆయన ఆఫీస్‌లో కొలీగ్స్ వద్ద నోటికి మాస్క్ ధరించకుండా దగ్గినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది.  తనకు కరోనా సోకిన విషయం తెలిసి కూడా కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను తమిళ్‌సెల్వన్ రామయను దోషిగా తేల్చిన కోర్టు జైలుకు పంపింది.

లియాంగ్ హప్ సింగపూర్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్న రామయపై నమోదైన మరో రెండు అభియోగాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కరోనా పరీక్షల్లో తనకు కొవిడ్ సోకిన విషయం తెలిసిన వెంటనే  ఇంటికి వెళ్లకుండా విషయం చెప్పేందుకు నేరుగా తాను పనిచేస్తున్న లాజిస్టిక్ కంపెనీకి వెళ్లాడు. 

తనకు పాజిటివ్ అన్న విషయం చెప్పకుండా మరో డ్రైవర్‌ను వెంటబెట్టుకుని కార్యాలయంలో ప్రవేశించాడు. అప్పటికే మాస్క్‌ ధరించిన ఆయన రెండుసార్లు దగ్గాడు. ఆ తర్వాత ఆఫీసును విడిచిపెట్టే సమయంలో మాస్క్ తీసి మరోమారు గట్టిగా దగ్గాడు. ఇది అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా, తాజాగా తమిళ్ సెల్వన్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు రెండు వారాల జైలుశిక్ష విధించింది.

More Telugu News