Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్ జామ్... కారులోనే కూరగాయలు వలిచిన మహిళ

  • బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయితే గంటలపాటు వాహనంలోనే!
  • ప్రయాణించే సమయంలో కారులోనే పచ్చి బఠానీలు ఒలిచిన మహిళ
  • ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో నెటిజన్ల స్పందన 
Woman peels green peas while waiting in Bengaluru traffic jam

బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ గంటల పాటు నిలిచిపోతుంది. బెంగళూరు ట్రాఫిక్ జామ్ వల్ల ఏడాదికి వేలాది కోట్ల నష్టం వాటిల్లుతోందని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. ఇంటి నుంచి కార్యాలయనికి, కార్యాలయం నుంచి ఇంటికి, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే సందర్భంలో బెంగళూరు ప్రయాణికులు గంటలపాటు వాహనాల్లో గడపవలసి వస్తోంది. బెంగళూరులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తన సమయాన్ని వృథా చేయకుండా కారులో కూర్చొని కూరగాయలు వలిచింది.

ప్రియ అనే మహిళా నెటిజన్ తాను కారులో కూర్చొని పచ్చి  బఠానీలు వలిచిన ఫోటోను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ట్రాఫిక్ రద్దీ సమయాల్లో ఇలా సమయాన్ని వెచ్చిస్తున్నానంటూ పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. నోబుల్ ప్రైజ్ ఇవ్వాలని ఒకరు, దీనిని మా బాస్‌కు పంపిస్తున్నానని మరొకరు, 'క్వైట్ ప్రోడక్టివిటీ' అంటూ ఇంకొకరు... ఇలా వివిధ రకాలుగా స్పందించారు. ఆమె తీరుకు కొంతమంది సెల్యూట్ అంటూ స్పందించారు.

More Telugu News